డీలర్ల కమీషన్ రూ.54 కోట్లు త్వరలో విడుదల
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రేషన్ డీలర్ల నుంచి పౌరసరఫరాల సంస్థ సేకరించే గన్నీ బ్యాగుల ధరను రూ.18 నుంచి రూ.21కి పెంచుతున్నట్టు ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. డీలర్లకు పెంచిన కమీషన్కోసం అవసరమైన రూ.54 కోట్లను త్వరలో విడుదల చేయనున్నట్టు చెప్పారు. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. రేషన్ బియ్యం పంపిణీతో డీలర్ల వద్దకు ప్రతినెలా 30 లక్షల గన్నీ సంచులు చేరుతాయని మారెడ్డి తెలిపారు. ఈ సంచులను గతంలోడీలర్లు ప్రైవేటువాళ్లకు విక్రయించుకునేవారని చెప్పారు. కానీ, ధాన్యం కోసం గన్నీ సంచుల సేకరణలో భాగంగా ప్రభుత్వమే వాటిని తిరిగి కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. డీలర్ల నుంచి గన్నీ బ్యాగులను ప్రభుత్వానికే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా మేనేజర్లను ఆదేశించారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని, ఇప్పటివరకు 77వేల మంది రైతుల నుంచి రూ.1,211 కోట్ల విలువ చేసే 6.43 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మారెడ్డి తెలిపారు. 6,798 కొనుగోలు కేంద్రాలకుగాను 4,485 కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. ఇప్పటి వరకు 92వేల మంది ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి సన్నబియ్యం పంపిణీచేశామని తెలిపారు.