రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జీవో విడుదల చేస్తుంది. అది విడుదలైన తర్వాత కచ్చితంగా అందరూ దానికి లోబడి ఉండాల్సిందే. కానీ కొన్నిసార్లు కొందరి కోసం తీసుకున్న నిర్ణయాలు మళ్లీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో అలాంటి విచిత్రమైన ఘటన జరిగింది. ఒక స్టార్ హీరో కోసం రాష్ట్ర ప్రభుత్వం తాము విడుదల చేసిన జీవోని మళ్లీ వెనక్కి తీసుకుంది. దాంట్లో కొన్ని సవరణలు చేసి మళ్లీ విడుదల చేసింది. ఇదంతా అక్కడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం జరిగింది. తాజాగా ఆయన నటించిన యువరత్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యాసంస్థల్లో ఉన్న లొసుగులను బయటపెడుతూ సంతోష్ తెరకెక్కించిన ఈ సినిమాకు కన్నడలో మంచి టాక్ వచ్చింది.
ఏప్రిల్ 1న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. అయితే పునీత్కు తెలుగులో మార్కెట్ లేకపోవడంతో యువరత్న ఇక్కడ తేలిపోయింది. కానీ కర్ణాటకలో మాత్రం పునీత్ రాజ్ కుమార్కు ఉన్న ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఇక్కడ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎంతగా అభిమానులు ఆరాధిస్తారో.. కర్ణాటకలో పునీత్ ఫాలోయింగ్ అలా ఉంటుంది. ఇదిలా ఉంటే పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కర్ణాటకలో పాక్షిక లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే క్రమంలో థియేటర్లలో కూడా 100 శాతం నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ తగ్గిస్తున్నట్లు జీవో విడుదల చేసింది. అయితే ఇదే సమయంలో పునీత్ సినిమా విడుదలైంది దాంతో తమ హీరో కలెక్షన్లు దెబ్బతింటాయని అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టారు. 100% ఆక్యుపెన్సీ పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.
ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను పవర్ స్టార్ పునీత్ ప్రత్యేకంగా కలిశాడు. తన సినిమా పరిస్థితి గురించి పునీత్ వివరించిన వెంటనే జీవోలో కొన్ని మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు యడ్యూరప్ప. ఏప్రిల్ 1 నుంచి కాకుండా 7 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ ఉండాలని నిర్ణయించారు. దాంతో తొలివారం పునీత్ రాజ్ కుమార్ సినిమాకు సంచలన వసూళ్లు రావడం ఖాయం అయిపోయింది. ఏదేమైనా ఒక స్టార్ హీరో కోసం జీవోలో మార్పులు చేయడం అనేది చిన్న విషయం కాదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి