పల్లె ప్రగతి నిధులతో రూపురేఖలు మారిన మారుమూల గ్రామం
పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం పూర్తి
కాల్వశ్రీరాంపూర్, మే 19:ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత గ్రామమైన కిష్టంపేట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దులో మానేరు నది పరీవాహక ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ పల్లె నేడు ప్రగతి బాటన ముందుకు సాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అందిస్తున్న తోడ్పాటుతో ఆదర్శ గ్రామంగా నిలిచింది.
కిష్టంపేట 1958లో మొట్టమొదట గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. గ్రామంలో 1508 జనాభా, 348నివాస గృహాలు ఉన్నాయి. ఇక్కడ 520 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. పల్లెప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో ప్రస్తుతం కిష్టంపేట రూపురేఖలే మారిపోయాయి.
నెలనెలా నిధులు.. సమకూరిన వసతులు
జనాభా ప్రాతిపదికన గ్రామానికి ఏడాదికి రూ. 23,06,208 నిధులు మంజూరవుతున్నాయి. ప్రతి నెలా వస్తున్న నిధులతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఈ నిధుల నుంచి 10శాతం రూ. 2,36,208 గ్రీనరీ బడ్జెట్గా కేటాయించిన పాలకవర్గం పచ్చదనాన్ని పెంపొందిస్తున్నది. గ్రామంలో నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసింది. గ్రామంలో నలుగురు పారిశుధ్య కార్మికులకు గానూ రూ. 4లక్షల 8వేలు ఏడాదికి చెల్లిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణకు గానూ గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. చెత్త సేకరణకు నాలుగు ట్రై సైకిళ్లను సమకూర్చుకున్నారు. గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణకు గానూ 676 చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ప్రభుత్వ భూమిని గుర్తించి పల్లె ప్రకృతి వనాన్ని రూ. 2లక్షలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. రూ 12.60 లక్షలతో గ్రామ సమీపంలోని మానేరు నదీ తీరాన వైకుంఠధామాన్ని ఏర్పాటు చేశారు.
ఎస్సీ కాలనీలో రూ. 12లక్షలతో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టారు. రూ. 4లక్షలతో రెండు కల్వర్టులు, రూ. 5లక్షలతో 150 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించారు. బస్టాండు ప్రాంతంలో గతంలో మురికి కూపంగా ఉన్న ప్రదేశంలో రూ. 2.50 లక్షలతో మొరం పోయించి, వారసంతకు అనుకూలంగా చేశారు. రూ.లక్షా50వేలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రూ.లక్షా 50 వేలతో 100 ఎల్ఈడీ విద్యుత్ దీపాలు అమర్చారు. గ్రామస్తుల నుంచి సేకరించిన రూ.8లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.10లక్షలతో మాదాసుపల్లెలో మంచినీటి ట్యాంకు నిర్మాణ పనులు మొదలయ్యాయి. హరితహారంలో భాగంగా గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి ఐదు ఎకరాల్లో 11వేల మొక్కలు నాటించారు. గ్రామానికి ముఖ ద్వారం ఏర్పాటు చేశారు. మొదటి దఫా నిర్వహించిన పల్లె ప్రగతి స్వచ్ఛతా కార్యక్రమంలో గ్రామంలో మురికి కాల్వలు శుద్ధి చేయడంతో పాటు విద్యుత్ సమస్యలు పరిష్కరించారు. మొత్తంగా కిష్టంపేట నేడు సకల సౌకర్యాలను సమకూర్చుకున్నది.
జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక
అభివృద్ధిలో ముందున్న కిష్టంపేట 2018-19 సంవత్సరానికి గానూ దీన్దయాళ్ ఉపాధ్యాయ స్వశక్తీకరణ్ పురస్కారానికి ఎంపికైంది. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా 2020సంవత్సరం ఏప్రిల్లో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సర్పంచ్ తిరుపతిరెడ్డికి ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపిక అందజేశారు. కాగా, పంచాయతీరాజ్రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా రూ.8లక్షల చెక్కును హైదరాబాద్లో అందుకున్నారు.