Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్, మండి లోక్సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కీ రోల్లో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ వద్దకు వెళ్లలేదు. ఇక ఇప్పటి వరకూ ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ జారీ చేయలేదు. దీనిపై కంగన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సినిమా రిలీజ్ ఆలస్యమయ్యే కొద్దీ ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎమర్జెన్సీ’ భారీ బడ్జెట్ మూవీ. ఈ చిత్రాన్ని ఏ విధంగా తెరకెక్కించానో నాకు తెలుసు. చిత్ర పరిశ్రమ నుంచి నాకు ఎలాంటి మద్దతూ లభించలేదు. జీ, కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో దీన్ని నిర్మించాను. ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కారణంగా ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం. మా చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్పై ఉంది’ అని కంగన ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1972లో విధించిన ఎమర్జెన్సీ కాలంనాటి రాజకీయ పరిణామాల గురించి ఈ సినిమాలో వివరించారు. అయితే, సిక్కుల మతస్థుల మనోభావాలు దెబ్బతీలా ఈ సినిమా తీశారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆరోపిస్తోంది. అకాల్ తఖ్త్ సాహిబ్పై బాంబు దాడి, ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ టైంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను విస్మరిస్తూ.. కథను పూర్తిగా ఒకవైపు మాత్రమే చూపించారని కొన్ని వర్గాలు ఎమర్జెన్సీ సినిమాని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఈ కారణాలతో ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇప్పటి వరకూ సర్టిఫికెట్ ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే కంగన, చిత్ర నిర్మాణ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని మందలించింది. సృజనాత్మకత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొంది. శాంతిభద్రతలకు ముప్పు ఉందనే కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నిరాకరించడంపై ఘాటు స్పందించింది. ఎమర్జెన్సీకి సర్టిఫికెట్ జారీ చేయడంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై జస్టిస్ బీపీ కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 25లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
‘ఎమర్జెన్సీ’ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read..
Kangana Ranaut | అందుకోసం దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు.. రాహుల్పై కంగన తీవ్ర వ్యాఖ్యలు
Ratna Bhandar: పూరి జగన్నాథ్ రత్నభండార్లో రెండో సర్వే షురూ..
BJP Mayor fakes blood donation | రక్త దానం చేసినట్లు నటించిన బీజేపీ మేయర్.. వీడియో వైరల్