హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ): దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 5,454 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ జోన్ (తెలంగాణ) 275 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులతో పాటు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 2021 ఏప్రిల్ 1 నాటికి 20-28 ఏండ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఉద్యోగార్థులు ఆన్లైన్లో మే 17 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు. పూర్తి వివరాలకు ఎస్బీఐ వెబ్సైట్ను సంప్రదించాలని బ్యాంకు వర్గాలు సూచించాయి.