హైదరాబాద్, జూన్4 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా తెలంగాణ ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని సీఎం కేసీఆర్ శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద మరొకటి లేదనే విషయం ప్రస్తుతం కరోనా సమయంలో మరోసారి రుజువైందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరక్క పరితపిస్తున్న దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలమని తెలిపారు. ఆరోగ్య సంపదను మించిన సంపద లేదనే విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి కార్యాచరణ చేపట్టిందని పేర్కొన్నారు. నాసిరకం ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ గ్రీన్కవర్ పెంచే హరితహరం వంటి పలు కార్యక్రమాలను పటిష్టంగా అమలుచేస్తున్నట్టు చెప్పారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం అమలుచేస్తున్న పలు కార్యక్రమాలు పర్యావరణాన్ని పెంచేందుకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాలు జాతీయస్థాయిలో ప్రశంసలందుకుంటున్నాయని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా స్వచ్ఛమైన తాగు, సాగునీరు రాష్ట్రవ్యాప్తంగా పుషలంగా లభిస్తున్నదని పేర్కొన్నారు. దీంతోపాటు పలు పథకాల ద్వారా పాడి పంటలు, పండ్లు, కూరగాయలు, మాంసాహారం సమృద్ధిగా ఉత్పత్తి జరిగి, పౌష్ఠికాహారం ప్రజలకు అందుతున్నదన్నదని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి, నదీజలాలను మళ్లించడంతో అడుగడుగునా పచ్చదనం, పర్యావరణ సమతుల్యతను సాధించామని చెప్పారు. తెలంగాణ ప్రజలు వైవిధ్యంతో కూడిన ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.