న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. సుకేశ్ చంద్ర రూ.200 కోట్ల దోపిడీకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే సాక్షిగా జాక్వెలిన్ వాంగ్మూలాన్ని సైతం నమోదు చేసింది. అయితే, అవసరమైన సమయంలో విచారణకు అందుబాటులో ఉండాలని, దేశం విడిచి వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు.
ప్రస్తుతం ఐఫా-2022 (IIFA 2022) అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు జాక్వెలిన్ దుబాయ్లోని యాస్ ద్వీపానికి వెళ్లాలి. అవార్డుల వేడుక కోసం 15 రోజుల పాటు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ కోర్టులో దరఖాస్తు చేసేందుకుంది. అబుదాబి, ఫ్రాన్స్, నేపాల్ వెళ్లేందుకు కోర్టును అనుమతి కోరింది. గత నెలలో మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. రూ.7.27 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
ఇదే కేసులో మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని కూడా విచారించారు. కాన్మ్యాన్ చంద్రశేఖర్ బాలీవుడ్ సెలబ్రిటీలకు రూ.20కోట్ల విలువైన బహుమతులు అందించినట్లు సమాచారం. వారిలో కొందరు కానుకలు తీసుకోవడానికి నిరాకరించగా.. అయితే నోరా, జాక్వెలిన్ మాత్రం సుకేశ్ చంద్రశేఖర్ నుంచి కానుకలను స్వీకరించినట్లుగా భావిస్తున్నారు.