IT Raids | మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐదు గంటలుగా ఇన్కం టాక్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. విదేశీ నిధులపై ఢిల్లీ బృందం ఆరా తీస్తున్నది. ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.500కోట్ల వరకు అమెరికా నుంచి పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంతో పాటు సంస్థ ప్రతినిధులు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మాణంలో ప్రస్తుతం పుష్ప-2 సినిమా తెరక్కెతున్నది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
సుకుమార్ ఇంట్లో సైతం అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఏకకాలంలో 4 చోట్ల రెండు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఉదయం నుంచి ఆఫీస్ గేటుకు తాళాలు వేసి లోపలి నుంచి బయటకు, బయట నుంచి లోపలికి ఎవరినీ ఐటీ అధికారులు అనుమతించడం లేదు. గత డిసెంబర్లో మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటీకి అందించిన లెక్కలు, కాగితాల్లో వ్యత్యాలు ఉన్నట్లుగా గుర్తించారు.
తనిఖీల తర్వాత జనవరిలో మైత్రి మూవీస్ విడుదల చేసిన వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా బడ్జెట్, లాభాలు, చెల్లించిన ఇన్ కంటాక్స్ లెక్కల్లోనూ భారీగా వ్యత్యాసం ఉందని సమాచారం. ఐటీ అధికారుల తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరో వైపు దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాల నేపథ్యంలో పుష్ప-2 షూటింగ్ రద్దు చేసినట్లు సమాచారం. రూ.700 కోట్లకు సంబంధించి జీఎస్టీ సరిగా కట్టలేదని ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.