Varisu | కొందరు దర్శకులకు స్టార్ హీరోలతో మంచి రాపో ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి దర్శకుడు వంశీ పైడిపల్లి. 2007లో మున్నా సినిమాతో కెరీర్ మొదలు పెట్టాడు వంశీ. ఇప్పటి వరకు ఆయన చేసింది అర డజన్ సినిమాలు మాత్రమే. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ప్రతి సినిమా స్టార్ హీరోతోనే చేయడం. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్స్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు వంశీ పైడిపల్లి. తాజాగా ఇలయతలపతి విజయ్ హీరోగా వారసుడు సినిమా చేస్తున్నాడు వంశీ పైడిపల్లి.
జూన్ 22న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో పాటు ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా మొదలైంది. విజయ్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఈ సినిమా మహర్షి సీక్వెల్లా ఉంది అంటూ వార్తలు మొదలయ్యాయి. మహర్షి సినిమాలో మహేశ్ బాబు కంపెనీ సీఈఓగా ఉంటాడు.. ఆ తర్వాత స్నేహితుడు సమస్యలు తెలుసుకుని ఊరికి వచ్చి దాన్ని నెరవేర్చి వెళ్లిపోతాడు. ఇప్పుడు వారసుడు ఫస్ట్ లుక్ కూడా ఇలాగే ఉంది.
జూన్ 21న విడుదల చేసిన లుక్లో చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు విజయ్. ఇక ఈ సినిమా సెకండ్ లుక్లో ఎద్దుల బండిపై కూర్చొని ఊరికి వెళ్తున్నాడు. వందల కోట్ల వారసుడైన విజయ్.. ఇండియాలోని తన కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చి వాటిని సరిదిద్దే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మహర్షి సీక్వెల్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేకపోలేదనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ బృందావనం.. రజనీకాంత్ అరుణాచలం సినిమాలను కలిపితే విజయ్ వారసుడు అంటూ మరో వార్త కూడా బయటికి వచ్చింది. ఏదేమైనా కేవలం రెండు పోస్టర్స్ తోనే సినిమా కథను డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు అభిమానులు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదల కానుంది.
“ఒకప్పుడు కటౌట్ పెట్టి ఫ్యాన్స్ అభిమానం చాటేవారు.. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే..”