హీరో సిద్ధార్థ్ గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పేరుకు తమిళ హీరో అయినా ఇక్కడ కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాడు ఈయన. ఇంకా చెప్పాలంటే మన హీరోల కంటే మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బాయ్స్ అనే డబ్బింగ్ సినిమాతో పరిచయం అయిన సిద్ధూ.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో చాలా తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ అయిపోయాడు సిద్ధార్థ్. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక వెనకబడిపోయాడు. ఇప్పుడు తమిళనాట వరస సినిమాలు చేస్తూ అక్కడ బిజీగా ఉన్నాడు సిద్ధూ. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమాలో శర్వానంద్ తో కలిసి నటిస్తున్నాడు.
ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఈయనకు బెదిరింపులు వస్తున్నాయి. చంపేస్తామంటూ వార్నింగులు కూడా వస్తున్నాయి. ఈయన ఫోన్ నెంబర్ లీక్ చేయడమే కాకుండా వార్నింగ్స్ కూడా రావడంతో విషయం అంతా ట్వీట్ చేసాడు సిద్ధార్థ్. తనకి ఎదురైన చేదు సంఘటనను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు ఈయన. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా సిద్ధార్థ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీని పలుమార్లు ప్రశ్నించాడు. దాంతో ఇప్పుడు తన ఫోన్ నెంబర్ ను అక్కడి బీజేపీ ఐటీ విభాగం వాళ్లు ఉద్ధేశ్య పూర్వకంగానే బయట పెట్టారని ఆరోపించాడు.
వాళ్ల నుంచి తనకు 500కు పైగా అసభ్య సందేశాలు.. చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా దారుణంగా తిడుతున్నారని చెప్పాడు. 24 గంటలు తన ఫోన్ మోగుతూనే ఉందని.. తనకు ఫోన్ చేసిన వాళ్లందరి కాల్ రికార్డులతో పాటు బీజేపీ లింక్స్ సహా ఫోటోలు పోలీసులకు ఇస్తానని తెలిపాడు సిద్ధూ. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదంటున్నాడు. మరి ఈ కాంట్రవర్సీ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలిక.
ఇవి కూడా చదవండి..