Movie Piracy | సినిమాలను పైరసీ చేస్తున్న దేశంలోనే అతిపెద్ద ముఠాను సైబర్ క్రేమ్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కంప్యూటర్లు, హార్డ్డిస్కులు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ టూల్స్తోపాటు ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ ముఠా వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.
రెండు రకాలుగా సినిమా పైరసీ జరుగుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఒకటి థియేటర్కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రెండోది అందరూ విస్తుపోయేలా డిజిటల్ శాటిలైట్ను కూడా హ్యాక్ చేసి పైరసీ చేస్తున్నారని చెప్పారు. పైరసీ సినిమాలు అప్లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని వివరించారు.
సింగిల్, హిట్ 3 సినిమాల పైరసీ జరిగినప్పుడు తమకు ఫిర్యాదులు అందాయని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడులోని కరూర్కు చెందిన సిరిల్ అని పేర్కొన్నారు. 2020 నుంచి అతను నాలుగు పైరసీ వెబ్సైట్లను నడుపుతున్నాడని చెప్పారు. కంప్యూటర్ సైన్స్ చదివిన సిరిల్ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేస్తున్నాడని అన్నారు. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉన్న మంత్ర మాల్ థియేటర్లో జానా కిరణ్కుమార్ రెడ్డి సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మరొకరికి పంపించారని చెప్పారు. హైఎండ్ కెమెరా ఉన్న సెల్ఫోన్తో నిందితులు సెల్ఫోన్లను జేబులో గానీ, పాప్కార్న్ డబ్బాలో కానీ పెడతారని అన్నారు. ప్రత్యేక యాప్ ఉపయోగించి సినిమాలను ఈ ముఠా పైరసీ చేసిందని అన్నారు. ఈ యాప్ వల్ల రికార్డింగ్ చే స్తున్నప్పుడు సెల్ఫోన్ స్క్రీన్లైట్ కూడా ఆఫ్లో ఉంటుందని అన్నారు. దీంతో ఎవరికీ ఏ అనుమానం రాదని అన్నారు. ఇతర భాషల చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారని అన్నారు.
బిహార్లోని పట్నాకు చెందిన అశ్విన్ కుమార్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ కేసులో మరో నిందితుడు అని చెప్పారు. డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలను అప్లోడ్ చేస్తున్నాడని తెలిపారు. ఇతను 1020 సినిమాలను నేరుగా సర్వర్లను హ్యాక్ చేసి అప్లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇతను కేవలం సినిమాలకు సంబంధించిన సర్వర్లు మాత్రమే కాకుండా ప్రభుత్వ విభాగాల వెబ్సైట్లు, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ను కూడా హ్యాక్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ చేసి ఉద్యోగుల జీతాల వివరాలు పొందాడని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ హ్యాక్ చేసి కేవలం ఎన్నికల జాబితాను మాత్రమే చూశారని అన్నారు. బిహార్లో ఉన్న అతని ఇంటికి తమ టీమ్ వెళ్లిందని.. అతని ఇంటికి 22 సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాడని చెప్పారు. పట్నాలో కూర్చుని పలు కంపెనీల సైట్లను హ్యాక్ చేశాడని తెలిపారు. నిందితుల వల్ల పలు కంపెనీల వాళ్లు తమ ఉద్యోగులను అనుమానించే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
ఈ సినిమాల పైరసీని ప్రధానంగా ప్రోత్సహిస్తున్నది బెట్టింగ్, గేమింగ్ యాప్ నిర్వాహకులే అని సీవీ ఆనంద్ తెలిపారు. పైరసీ సైట్లలోని లింక్లను క్లిక్ చేస్తే యూజర్ వివరాలన్నీ పైరసీ ముఠాకు వెళ్తాయన్నారు. ఎక్కువ సినిమాల పైరసీని కిరణ్, అశ్వనీకుమార్ ముఠా వల్లే జరిగిందని తెలిపారు. ఈ సినిమాలను పైరసీ చేసేందుకు సిరిల్ అనే వ్యక్తి నెదర్లాండ్స్, ప్యారిస్కు చెందిన ఐపీ అడ్రస్లు వాడుతున్నారని సీవీ ఆనంద్ తెలిపారు. ఇతనికి బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు నెలకు రూ.లక్షలు ఇస్తున్నారని తెలిపారు. ఈ ముఠా బిట్కాయిన్లు, క్రిప్టో కరెన్సీ రూపంలోనే డబ్బులు తీసుకుంటుందని వివరించారు. ఇప్పటివరకు 500 సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించామన్నారు. సిరిల్ వద్ద కుబేర మూవీతో సహా అనేక సినిమాలను గుర్తించామని, అలాగే 10 క్రిప్టో కరెన్సీ వాలెట్లు, మూడు బ్యాంకు ఖాతాలను గుర్తించామని అన్నారు. ఈ ముఠా పైరసీ వల్ల తెలుగు సినీ పరిశ్రమకు 3700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.