‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాల నిర్మాణంతో హోంబలే ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ‘కేజీఎఫ్-2’ పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్ తమ తాజా చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తారు. ‘గురు’ ‘ఆకాశమే నీ హద్దురా’ వంటి స్ఫూర్తివంతమైన కథాంశాల్ని తెరకెక్కించి టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకుందామె.
గురువారం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమా విశేషాల్ని పంచుకుంది హోంబలే ఫిల్మ్. ‘కొన్ని యథార్థమైన కథల్ని సరైన రీతిలో తప్పకుండా చెప్పితీరాలి. ఓ ఉత్తేజకరమైన కథ ఇది. వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నాం. చాలా సినిమాల తరహాలోనే భారతదేశ ఊహాల్ని ఆవిష్కరిస్తుంది’ అంటూ ట్విట్టర్ ప్రకటనలో పేర్కొన్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో సూర్య కథానాయకుడిగా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ‘సూరారై పొట్రు’ ( తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) తర్వాత తాను మళ్లీ సూర్యతో కలిసి పనిచేయబోతున్నానని దర్శకురాలు సుధా కొంగర ఓ సందర్భంలో వెల్లడించింది. దీంతో హోంబలే ఫిల్మ్స్ సినిమాలో సూర్య కథానాయకుడిగా నటిస్తారనే వార్తలకు బలం చేకూరుతున్నది.