అశిష్గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘హద్దులేదురా’. రాజశేఖర్ రావి దర్శకుడు. వీరేష్ గాజుల బళ్లారి నిర్మాత. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి అగ్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, ఆధ్యాత్మికవేత్త రాధామనోహర్ దాస్ అతిథులుగా వచ్చేసి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు.
‘జీవితాన్ని నచ్చినట్టు బతకాలని చెప్పడమే ప్రధాన ఇతివృత్తంగా ఈసినిమా చేశాం. అందుకే ‘హద్దులేదురా’ అనే టైటిల్ పెట్టాం. నటీనటులు, సాంకేతికనిపుణులంతా అద్భుతంగా సహకరించారు.’ అని దర్శకుడు చెప్పారు. కథపై నమ్మకంతో ఈ సినిమా చేశామని, ఈనెల 21న అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని నిర్మాత కోరారు. ఇంకా తనికెళ్లభరణి, అశిష్గాంధీ తదితరులు కూడా మాట్లాడారు.