చెన్నారావుపేట, ఏప్రిల్ 7: కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నివారణలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం కరోనా నియంత్రణపై కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు మహేందర్రెడ్డి, హరిసింగ్, డీఎంహెచ్వో డాక్టర్ చల్లా మధుసూదన్, డీపీవో చంద్రమౌళి, ఆర్డీవో మహేందర్జీతో కలిసి జిల్లాలోని వివిధ మండలాల తహసీల్దార్లు, ఎస్సైలు, ఎంపీడీవోలు, మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. అధికారులు మండల స్థాయిలో కోఆర్డినేషన్ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలని అధికారులకు సూచించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని, దీనిపై మెడికల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకునేలా ఊరూరా ప్రచారం చేయాలని అధికారులను కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు హోంఐసోలేషన్లో ఉండేలా మానిటరింగ్ చేయాలన్నారు. మండల, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులను సయన్వయ పరుచుకుంటూ సమావేశాలు నిర్వహిస్తూ కొవిడ్ వ్యాప్తి అరికట్టాలన్నారు. నర్పంపేట సీహెచ్సీ, పవన్ నర్సింగ్ హోంలో ఆక్సీజన్ వెసులుబాటుతోపాటు 20 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి హుండీ లెక్కింపు
గీసుగొండ, ఏప్రిల్7: కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను బుధవారం లెక్కించారు. ఈహుండీల ద్వారా రూ.15లక్షలా 46వేలా150 నగదు, కానుకలు వచ్చినట్లు ఈవో కమల తెలిపారు. ఒక అమెరికా డాలర్, మిశ్రమ బంగారుం, వెండీ హుండీల ద్వారా వచ్చినట్లు తెలిపారు. విశ్రమ వెండి, బంగారాన్ని తిరిగి హుండీలో వేసిసినట్లు ఆమె తెలిపారు. హుండీల ద్వారా వచ్చిన నగదును బ్యాంక్లో లక్ష్మీనర్సింహస్వామి పేరున ఉన్న ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీ లెక్కించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మహబూబాబాద్కు చెందిన వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు, ఆలయ ఫౌండర్ శ్రీనివాసాచార్యులు, ఈవో కమల, ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డమీది కుమారస్వామి, అర్చకులు కాండూరి రామాచార్యులు, ఎఫ్వో కవిత, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంగ్ల ఉపాధ్యాయుడి ప్రాజెక్టుకు జాతీయ అవార్డు
సంగెం, ఏప్రిల్7: మొండ్రాయి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు డాక్టర్ శంకరభక్తుల సత్యం రూపొందించిన ప్రాజెక్టుకు జాతీయ అవార్డు లభించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) న్యూఢిల్లీ వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన విద్యలో వినూత్న పద్ధతులు, ప్రయోగాలు ప్రాజెక్టుల పోటీల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడు శంకరభక్తుల సత్యంకు జాతీయ అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో ఉన్నత పాఠశాలల విభాగంలో డాక్టర్ సత్యం రూపొందించిన ది యూస్ ఆఫ్ ఐసీటీ ఇన్ ఈఎల్టీ ప్రాజెక్టు ఎంపికైంది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషానైపుణ్యాలను పెంపొందించేందుకు డాక్టర్ సత్యం ప్రాజెక్టు ఎంపిక కావడం విశేషం. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు 22ఏళ్లుగా బోధిస్తున్న డాక్టర్ సత్యంను ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా అలర్ట్ : ఢిల్లీలో మహమ్మారి విజృంభణ
ఒంటరిగా ఉన్నా మాస్క్ ఉండాల్సిందే!