న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపు తప్పిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. టెస్ట్ పాజిటివిటీ రేటు(టీపీఆర్) 5 శాతానికి ఎగబాకడం ఇన్ఫెక్షన్ వ్యాప్తిపై గుబులు రేపుతోంది. గడిచిన 24 గంటల్లో 64,003 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3548 మందికి పాజిటివ్గా వెల్లడైంది. ఐదు శాతం మించి పాజిటివిటీ రేటు ఉండటంతో ఇన్ణెక్షన్ వ్యాప్తిని ఇప్పుడు మనం ఊహించలేమని ఎయిమ్స్ మాజీ డీన్ డాక్టర్ ఎన్కే మెహ్రా పేర్కొన్నారు.
జనవరిలో ఢిల్లీలో టీపీఆర్ ఒక శాతం ఉందని, గత రెండు వారాల కిందట కూడా టీపీఆర్ తక్కువగానే ఉందని గత కొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులతో టీపీఆర్ కూడా ఎగబాకిందని చెప్పారు. వ్యాధి తీవ్రత, మరణాలపైనా ఇది ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా పలు వ్యాధులతో బాధపడే వారు, వృద్ధులకు ముప్పు అధికంగా ఉంటుందని డాక్టర్ మెహ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గత ఐదు రోజుల్లో మహమ్మారితో బాధపడుతూ ఢిల్లీలో 64 మంది మరణించారని, సోమవారం ఒక్కరోజే 15 మంది ప్రాణాలు విడిచారని అధికారులు పేర్కొన్నారు.