హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్పై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని కావూరి హిల్స్లో ఉన్న సంస్థ కార్యాలయంలో జీఎస్టీ నిఘా విభాగం అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సంస్థ ఆదాయం, చెల్లిస్తున్న జీఎస్టీకి తేడా ఉండటంతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.6 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. లోతైన పరిశీలన నిమిత్తం సంస్థ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
యూవీ క్రియేషన్స్ సంస్థను 2013లో హీరో ప్రభాస్ సోదరుడు ప్రమోద్ ఉప్పలపాటి తన స్నేహితులు వంశీ, విక్రమ్తో కలిసి స్థాపించారు. మొదటి సినిమాను ప్రభాస్ హీరోగా ‘మిర్చి’ని నిర్మించింది. అనంతరం శర్వానంద్తో ‘రన్ రాజా రన్’, గోపీచంద్తో ‘జిల్’ సినిమాలు నిర్మించారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, సాహో, రాధే శ్యామ్ వంటి పలు భారీ సినిమాలను రూపొందించారు. ఇక ప్రభాస్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యూవీ క్రియేషన్స్ సంస్థే విడుదల చేస్తున్నది.