Film Industry in Telangana | భారతదేశంలో తొలితరం సినిమా ప్రస్తావన వస్తే.. ముంబై, కోల్కతా, చెన్నై పేర్లే చెబుతారు. సినీ చరిత్రకారులు సైతం మన సినిమా పునాదులన్నీ అక్కడే ఉన్నట్టు వాదిస్తారు. నిజానికి, భారతీయ సినిమా తొలినాళ్ల ప్రస్థానంలో హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషించింది.
.. కానీ విశ్లేషకులు ఈ చారిత్రక సత్యాన్ని విస్మరించడం ఒకింత విషాదమే! అయితే ఈ విస్మరణను సహేతుకంగానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, 1920ల నాటి చారిత్రక పరిస్థితులు, సందర్భాలు వేరుగా ఉండేవి. దేశంలో సినిమా తొలి పరిచయం జరిగిన సమయం.. 1910- 1920 దశకం. నాటికి ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లోని వాతావరణం వేరు. హైదరాబాద్ నేపథ్యం వేరు. ఆ మూడు నగరాలూ బ్రిటిష్ ఇండియా ప్రధాన స్థావరాలు, కీలక పాలనా కేంద్రాలు కూడా. హైదరాబాద్ మాత్రం బ్రిటిష్ ప్రభుత్వంతో ‘సైన్య సహకార ఒడంబడిక’ చేసుకున్న స్వదేశీ సంస్థానంలో ఓ భాగం. కాబట్టే, నాటి చరిత్రకారులు సినిమా చరిత్రను బ్రిటిష్ ఇండియాలోని నగరాలకే పరిమితం చేశారు. హైదరాబాద్లో తొలితరం సినిమా చరిత్రను పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో తొలినాళ్ల సినిమా ప్రస్థానం గురించి, భారతీయ సినిమా విస్తరణలో హైదరాబాద్ పాత్ర గురించి సగర్వంగా చాటుకోవాల్సిన అవసరం ఉంది.
భారతీయ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు.. ముగ్గురు మహావ్యక్తుల పేర్లు తప్పక వినిపిస్తాయి. మొదటి వ్యక్తి దాదాసాహెబ్ ఫాల్కేగా సుప్రసిద్ధులైన ఢూంఢీరాజ్ గోవింద్ ఫాల్కే. సినిమా పట్ల ఆకర్షితుడై, కష్టనష్టాలకోర్చి లండన్ వెళ్లి సినిమా సాంకేతికతను అర్థం చేసుకున్న తొలి భారతీయుడు ఆయన. వచ్చీరాగానే ముంబైలో మనవైన సినిమాలను తీయడం ప్రారంభించాడు. అలా 1913లో ‘రాజా హరిశ్చంద్ర’తో పూర్తిస్థాయి భారతీయ సినిమాకు పునాదులు వేశాడు. రెండో వ్యక్తి హీరాలాల్ సేన్. కోల్కతా కేంద్రంగా సినిమాలు నిర్మించిన తొలితరం వెండితెర స్వాప్నికుడు. మూడో వ్యక్తి దక్షిణ భాగంలో చెన్నై కేంద్రంగా సినిమాలు నిర్మించిన నటరాజ మొదలియార్. వీరంతా అప్పటికి అందుబాటులో ఉన్న పరిమిత సాంకేతిక పరిజ్ఞానంతోనే మూకీ సినిమాలకు ప్రాణం పోశారు. ఇదే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా తొలితరం సినిమాలకు ప్రాణంపోసిన సృజనశీలి.. ధీరేంద్రనాథ్ గంగూలీ. భారతీయ సినిమాకు కనిపించని నాలుగో పునాది ఇతను. ధీరేన్ గంగూలీ చొరవ కారణంగా మూకీతో మొదలై అనతి కాలంలోనే సినిమాల పంపిణీ, ప్రదర్శనకు బలమైన కేంద్రంగా రూపొందింది హైదరాబాద్. ధీరేన్ జన్మతః బెంగాలీ. విద్యావంతుడు. భిన్నరంగాల నిపుణులను సాదరంగా స్వాగతించి.. తన దర్బారులో కొలువులు ఇచ్చేవారు నిజాం. అలా హైదరాబాద్ అప్పటికే ‘విశ్వనగరం’గా రూపుదాల్చింది. మిగతా సంస్థానాల కంటే సుసంపన్నంగానూ వెలుగొందేది. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ను భూమిమీద అత్యంత ధనవంతుడిగా ప్రకటిస్తూ ‘టైమ్’ మ్యాగజైన్ ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. దీంతో దేశదేశాల మేధావులంతా హైదరాబాద్ రాజ్యంలో కొలువు చేయాలని ఉవ్విళ్లూరేవారు.
నిజాం కాలేజీలో ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు ధీరేన్. అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న ‘సినిమా’ అంటే ఓ ఆకర్షణ ఉండేది అతనికి. ఆ రంగంపై లోతైన అధ్యయనం చేశాడు. యూరప్ నుంచి కెమెరా, రీలు ప్రొజెక్టర్ వంటి పరికరాలు దిగుమతి చేసుకున్నాడు. స్వయంగా సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. 1922లో లోటస్ ఫిల్మ్ కంపెనీ పేరుతో నిర్మాణ సంస్థనూ స్థాపించాడు. తొలి ప్రయత్నంగా ‘చింతామణి’ తీశాడు. దర్శకత్వం వహిస్తూనే ప్రధాన పాత్రలో నటించాడు. అదే ఏడాది మరో నాలుగు చిత్రాలు నిర్మించాడు. కథల విషయంలో చాలా వైవిధ్యాన్ని ప్రదర్శించేవాడు. పురాణాల పట్ల ప్రజల మక్కువను గ్రహించి.. రామాయణ ఇతివృత్తంతో ‘ఇంద్రజిత్’ చిత్రాన్ని తీశాడు. ఇందులో ధీరేన్, నటి సీతాదేవి ప్రధాన పాత్రలలో నటించారు. మూడు కామెడీ సినిమాలనూ నిర్మించాడు ధీరేన్. ఆ మరుసటి ఏడాది.. శివపార్వతుల కథ ‘హరాగౌరి’కి ప్రాణం పోశాడు. సామాజిక అంశాలతో ‘స్టెప్ మదర్’, భక్తి ప్రధానంగా ‘యయాతి’ తెరకెక్కించాడు. ధీరేన్ గంగూలీ తీసిన ఎనిమిది చిత్రాలూ హైదరాబాద్ సినిమాకు పునాదులు వేశాయి. బ్రిటిష్, యూరప్ ప్రభావంతో సినిమాలు తీసినా.. అదే సమయంలో పౌరాణిక కథలను తెరకెక్కించాడు ధీరేన్. నాటకాలను సినిమాలుగా తీసే సంప్రదాయానికీ శ్రీకారం చుట్టాడు.
ధీరేన్ గంగూలీ స్ఫూర్తితో అనేక సినిమా నిర్మాణ సంస్థలు పుట్టుకొచ్చాయి. వాటిలో ఒకటి మహావీర్ ఫోటోప్లేస్. ఈ సంస్థ… ఫాదర్స్ లవ్ (1929), ఎ ప్రిన్స్ ఆఫ్ ద పీపుల్, యాన్ ఐడియల్ ఉమెన్, ఎవెరిస్ (1930), బ్లాక్ ఈగిల్, కిడ్నాప్డ్ బ్రైడ్, నిర్దార్ నీరు (1931) సినిమాలను నిర్మించింది. ద నేషనల్ ఫిల్మ్ కంపెనీ (1931) సంస్థ నాలుగు చిత్రాలు తీసింది. హీరో ఆఫ్ ద వైల్డ్స్.. ‘హీరో’ అనే టైటిల్తో వచ్చిన మొదటి సినిమా. అడవి చుట్టూ తిరిగే కథాంశంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు చునీలాల్ పరేఖ్ దర్శకుడు. మరో సినిమా ‘థీఫ్ ఆఫ్ ఇరాక్’. ఇదో సాహస గాథ. దేశభక్తి నేపథ్యంలో ‘దేశ్బంధు’, కుటుంబ కథాచిత్రంగా ‘మేరీ మా’ చిత్రాలనూ తెరకెక్కించిందీ సంస్థ. హైదరాబాద్ రాజ్యంలో 1922లో తొలి సినిమా నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి 1947 వరకు.. 25 సంవత్సరాల కాలంలో ఎన్నో నిర్మాణ సంస్థలు వెలిశాయి. డొమినియన్ సౌండ్ ప్రొడక్షన్ లిమిటెడ్, దక్కన్ టాకీస్ లిమిటెడ్, వీనస్ టాకీస్ లిమిటెడ్, స్టేట్ ఫిల్మ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆలంగీర్ పిక్చర్స్ లిమిటెడ్, హైదరాబాద్ ఫిల్మ్స్ లిమిటెడ్ కూడా ముఖ్యమైనవే.
మొదట్లో సినిమాలను గుడారాలలో ప్రదర్శించేవారు. క్రమంగా శాశ్వత ప్రాతిపదికన థియేటర్లు నిర్మించడం ఆరంభమైంది. హైదరాబాద్ రాజ్యంలో తొలి సినిమా థియేటర్ 1920లో ఏర్పాటైనట్టు తెలుస్తున్నది. ధీరేన్ గంగూలీయే సినిమా థియేటర్ల నిర్మాణానికి కూడా పునాదులు వేశాడని అంటారు. క్రమంగా సినిమా థియేటర్లు ఇతర నగరాలు, పట్టణాలకు
విస్తరించాయి. 1939 నాటికే 70కి పైగా తాత్కాలిక, శాశ్వత సినిమా థియేటర్లు ఉన్నట్టు ఫజల్ భాయ్ అనే సినీరంగ నిపుణుడు ‘ఇండియన్ ఫిల్మ్ రివ్యూ’ అనే ఆనాటి మ్యాగజైన్లో ప్రస్తావించాడు. మొత్తానికి, 1948 నాటికి సినిమా హాళ్ల సంఖ్య 140కి చేరుకున్నది. ఆదిలాబాద్లో ‘గ్రాండ్ టెంపరరీ థియేటర్’, అలంపూర్లో ‘సత్యనారాయణ టెంపరరీ థియేటర్’, అమీర్పేటలో ‘విజయా థియేటర్’, ఆరూట్లో ‘బాలాజీ థియేటర్’, ఆత్మకూర్లో ‘ఎస్వీఎల్ థియేటర్’ విజయవంతంగా నడిచాయి. ఈ విషయాలను తెలుగు సినిమా పరిశ్రమ తన 90 ఏండ్ల ప్రస్థానంలో ఏనాడూ గుర్తించలేదు. హైదరాబాద్ విషయానికొస్తే.. ఎంఆర్ మోడీ సోదరులు పుత్లీబౌలిలో ‘నిశాంత్’ పేరుతో తాత్కాలిక థియేటర్ నిర్వహించేవారు. దీనిని కళా ప్రదర్శనలకూ ఉపయోగించేవారు. అప్పటివరకూ ఉన్న థియేటర్లతో పోలిస్తే.. తమ ప్రత్యేకత చాటుకోవడానికి ‘టాకీస్’ అని పేరు పెట్టడం ప్రారంభించారు. 1921లో సికింద్రా
బాద్లో నిర్మించిన ‘రాజేశ్వర్ టాకీస్’ ఇందుకు ఉదాహరణ. 1927లో యాకుత్పురాలో ‘యాకుత్ మహల్’ను అందుబాటులోకి తెచ్చారు. థియేటర్, టాకీస్లకు భిన్నంగా ‘మహల్’ అనే పదాన్ని చేర్చడం మరో పరిణామం. యాకుత్ మహల్ కోసం సినిమా ప్రొజెక్టర్లను చికాగో నుంచి దిగుమతి చేసుకున్నారు. ‘యాకుత్ మహల్’లో 95 ఏండ్లుగా సినిమాలు ఆడుతూనే ఉన్నాయి. 1932లో గుల్జార్ హౌజ్ ప్రాంతంలో కృష్ణా టాకీస్, 1934లో మనోహర్ టాకీస్ సినిమాలకు కొత్త వేదికలుగా మారాయి. అదే సంవత్సరం ‘జమ్రూద్ థియేటర్’ నిర్మితమైంది. ఇందులో తొలి సినిమాగా పృథ్వీరాజ్ కపూర్, దుర్గా ఖోటే నటించిన ‘సీత’ను ప్రదర్శించారు. అప్పట్లోనే హైదరాబాద్లో గ్రూప్ ఆఫ్ థియేటర్స్ ఏర్పాటయ్యాయి. 1935-1940 మధ్య ఆర్గుస్ థియేటర్స్ పేరిట మూడు థియేటర్లు లాల్ దర్వాజా, నారాయణగూడ, అఘాపురాలలో నిర్మాణమయ్యాయి. నారాయణగూడలో తెలుగు సినిమాలు, అఘాపురాలో హిందీ సినిమాలు ఆడించేవారు.
తొలి సినిమా ‘రాజా హరిశ్చంద్ర’తోపాటే దేశంలో సినిమా వ్యాపారం అంకురించింది. అయితే సినిమాకు ఇంత వ్యాపార విలువ ఉంటుందని ఎవరికీ తెలియదు. ఓ లాభసాటి పెట్టు
బడిగా సినిమా వ్యాపారం స్థిరపడటానికి రెండు దశాబ్దాలు పట్టింది. అలా మొదటి ‘భారతీయ చలన చిత్ర సంఘం’ (మోషన్ పిక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా) 1932లో ముంబైలో ఏర్పడింది. ఆ తర్వాత, 1937లో భారతీయ సినీ నిర్మాతలు తమ వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ కోసం ‘భారతీయ చలనచిత్ర నిర్మాతల సంఘం’ పేరిట ఓ ప్రత్యేక సంస్థను స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే సినిమా డిస్ట్రిబ్యూటర్లు ‘భారతీయ చలనచిత్ర పంపిణీదారుల సంఘం’ స్థాపించుకున్నారు. దక్షిణ భారతంలో చెన్నై కేంద్రంగా 1930 దశకం నుంచి సినిమాల నిర్మాణం ఊపందుకుంది. అలనాటి మద్రాసు తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలకు కూడా చిరునామాగా మారింది. దక్షిణాది చిత్రాల ప్రయోజనాల సాధన కోసం 1939లో ‘దక్షిణ భారత సినీ వాణిజ్య విభాగం’ ఏర్పాటైంది. ఆ తర్వాత బెంగళూరు కేంద్రంగా ‘మైసూర్ రాష్ట్ర సినీ వాణిజ్య విభాగం’, విజయవాడ కేంద్రంగా ‘బెజవాడ సినీ పంపిణీదారుల సంఘం’ ఏర్పాటయ్యాయి. అయితే దక్షిణ భారతదేశంలో ఫిలిం ఛాంబర్ స్థాపించిన రెండేండ్లలోనే.. అంటే 1941లోనే బెంగళూరు, విజయవాడకు ముందే హైదరాబాద్లో సినీ వ్యాపార సంరక్షణ సంఘాలు ఏర్పాటు కావడం గమనార్హం. ఇక్కడ 1941లోనే ‘హైదరాబాద్ రాజ్య సినీ వాణిజ్య విభాగం’ ప్రాణంపోసుకుంది. ఇందులో హైదరాబాద్ రాజ్యంలోని సినిమా థియేటర్ల ప్రదర్శకులు, పంపిణీ దారులు సభ్యులు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లోని ‘ఫిలింఘర్’ అనే భవనంలో ఉండేది. అదే ఏడాది ‘హైదరాబాద్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్’ పేరిట సినిమా థియేటర్ల యజమానులతో ఒక సంస్థ రూపుదిద్దుకుంది.
సెలెబ్రిటీలు థియేటర్కు వెళ్లి చూడటం అన్నది తిరుగులేని పీఆర్ సూత్రం. ఆ వార్త జనంలోకి వెళ్తుంది. నలుగురూ మాట్లాడుకుంటారు. అంతకు మించిన పబ్లిసిటీ ఏం ఉంటుంది? ఈ సంప్రదాయానికి 1930 దశకంలోనే శ్రీకారం చుట్టిన ఘనత నిజాం ప్రభువుదే! 1935 అక్టోబర్ 15న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తొలిసారిగా థియేటర్కు వెళ్లి సినిమా చూశారు. తెలంగాణ సినిమాకు సంబంధించినంత వరకూ ఇదో చారిత్రక ఘట్టం. హైదరాబాద్లోని ‘ఇంపీరియల్ సినిమా హాల్’లో ప్రధానమంత్రి, ఇతర మంత్రులతో కలిసి ‘జవానీ కీ హవా’ చిత్రాన్ని తిలకించాడు. బాంబే టాకీస్ నిర్మాణంలో, ఫ్రాంజ్ ఓసైన్ దర్శకత్వంలో దేవికారాణి, నజ్మల్ హుస్సేన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రమిది. దీనివల్ల ప్రజల్లో సినిమాల పట్ల ఉన్న ఒకింత ఉదాసీనత తొలగిపోయింది. కులీనుల కోసం ప్రత్యేకంగా దివాన్ దేవిడీ ప్రాంతంలో ‘సెలెక్ట్’ థియేటర్ నిర్మించారు. ఆ తర్వాత అదే ‘ఎస్టేట్ టాకీస్’గా మారింది.
ప్రదర్శనల సంఖ్య పెంచితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా సినిమాకు ఆదాయం, లాభం.. రెండూ పెరుగుతాయి. ఈ విషయాన్ని గమనించిన హైదరాబాద్ ప్రభుత్వం ప్రదర్శనల సంఖ్య విషయంలో సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది. తొలినాళ్లలో రోజుకు రెండు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఉండేది. సినిమా ప్రదర్శనలకు రాత్రి సమయమే అనుకూలం కాబట్టి, ఇలాంటి సంప్రదాయం ఏర్పడింది. థియేటర్లను తాత్కాలిక ప్రాతిపదికన టెంట్లలో రూపొందేవి. 1932 తర్వాత శాశ్వత సినిమా థియేటర్లు అందుబాటులోకి వచ్చినా, పాత విధానమే కొనసాగింది. 1930 దశకం ద్వితీయార్ధంలో శాశ్వత థియేటర్లలో మార్నింగ్, మ్యాటినీ షోలకు కూడా అనుమతులు ఇచ్చారు. దాంతో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు లభించింది.
నిజాం సర్కారు సినిమా రంగానికి అనేక ప్రోత్సాహకాలు అందించింది. కొన్ని చట్టాలనూ చేసింది. హైదరాబాద్ సినీ రంగాన్ని మలుపు తిప్పిన ఓ దురదృష్టకర సంఘటన.. ‘మోతీ మహల్ ఉదంతం’. మోతీ మహల్ కోఠిలోని సుల్తాన్ బజార్లో ఉండేది. 1936 జూన్ 14 నాడు ‘కాలేజ్ గర్ల్’ సినిమా ఆడుతున్న సమయంలో హఠాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 14 మంది మరణించారు. మరెందరో గాయపడ్డారు. దీంతో సినిమా హాళ్లలో భద్రత గురించి చర్చ మొదలైంది. నిజాం ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ మోతీమహల్ అగ్ని ప్రమాద సంఘటన నేపథ్యంలో ఇతర సినిమా థియేటర్లలోని సదుపాయాలు, స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేసింది. వాటిని అనుసరించి, నిజాం ప్రభుత్వం 1937లో థియేటర్ల నిర్మాణం, నిర్వహణ, సినిమా ప్రదర్శన విషయంలో ఒక సమగ్ర చట్టాన్ని తెచ్చింది. భారతీయ సినిమా చరిత్రలోనే తొలి చట్టం ఇదే కావచ్చు. సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి నిజాం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.. కొత్త స్టూడియోల నిర్మాణానికి సహాయం చేసింది. నిర్మాతలకు రాయితీలు ఇచ్చింది. స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించింది.
నిజాం ప్రభుత్వం సినిమా శక్తిసామర్థ్యాలను మొదటి దశలోనే గుర్తించింది. అందుకే సంప్రదాయవాదులు, మేధావులు సినిమాను పాశ్చాత్య భావజాలపు అవశేషంగా విమర్శించినా.. నిజాం సర్కారు ఆ రంగాన్ని ప్రోత్సహించడానికి వెనుకడుగు వేయలేదు. రాజ్యమంతటా వెండితెరను విస్తరించడానికి అనేక సదుపాయాలు కల్పించింది. కేవలం ఇరవై ఏండ్ల కాలం (1921-1940) లోనే సినిమా రంగం విస్తృత ప్రజాదరణను సాధించింది. నిజాం ప్రభుత్వం 1941 డిసెంబర్ 12న మొదటిసారిగా ‘వినోద పన్ను’ ప్రవేశపెట్టింది. సినిమాను ఒక పరిశ్రమగా, ఆదాయ వనరుగా గుర్తించడంలో ఇదో భాగం. దీనివల్ల సినీ నిర్మాణం, ప్రదర్శనలు దెబ్బతింటాయేమోనని కొందరు భయపడ్డారు. కానీ, ఆశ్చర్యంగా ఆ తర్వాత కూడా హైదరాబాద్లోనే కాదు, ఇతర ప్రాంతాల్లోనూ సినిమా థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. ఇలా హైదరాబాద్ రాజ్యంలో సినిమా ఓ కళగా, నూతన సాంకేతిక సృజనగా, నవీన కాలపు అద్భుతంగా ఎంతో ప్రాధాన్యాన్ని సాధించింది. భారతీయ సినీరంగ వికాసంలో చెన్నై, కోల్కతా, ముంబైలకు దీటుగా తెలంగాణ కూడా పాలుపంచుకున్నదని ఈ ఆధారాల వల్ల వెల్లడవుతున్నది. ఈ నేపథ్యమే ఆ తర్వాత 1970 దశకంలో తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు తరలి రావడానికి కావలసినచారిత్రక భూమికను అందించి ఉంటుంది.
భారతదేశంలో మొట్టమొదటి సారిగా సినిమా పురస్కారాల సంస్కృతికి శ్రీకారం చుట్టిన ఘనత కూడా హైదరాబాద్ రాజ్యానిదే! 1935లోనే అవార్డుల విధానానికి బాటలు వేసింది. జస్టిస్ నవాబ్ జయిన్ యార్జంగ్ అధ్యక్షతన నియమించిన కమిటీ దేశం మొత్తం మీద సినీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుంది. నిజాం ప్రభుత్వ పురస్కారానికి దేవకీ బోస్, ఫతేలాల్, వి.కుమార్ను ఎంపికచేసింది. దీన్నిబట్టి ప్రాంతీయతకు అతీతంగా సినిమా కళకు సేవచేస్తున్న మహనీయులను నిజాం ప్రభుత్వం గౌరవించిందని అర్థం అవుతున్నది. హైదరాబాద్లో షూటింగ్ జరుపుకొన్న తొలి టాకీ ‘షికారీ’! ఈ సినిమా షూటింగ్ 1932లో జరిగింది.
…? మామిడి హరికృష్ణ, 8008005231
S.S.Rajamouli | రాజమౌళికి జేమ్స్ కామెరూన్ భారీ ఆఫర్.. ఆనందంలో టాలీవుడ్ సినీ అభిమానులు..!