New Year Special | ‘హాయ్! నేనొస్తున్నా!’. ‘ఎవరు నువ్వు?’ ‘గుర్తుపట్టలేదా. 2022కు అన్నయ్యను, 2024కు తమ్మయ్యను!!’ ‘ఓహ్ 2023 వా! ఇంతకీ నీతోపాటు మాకేం తెస్తున్నావ్..?’ ‘మీకు ఇష్టమైనవెన్నో.. కాలంతో పరుగులు తీస్తూ కాలక్రమంలో మర్చిపోయిన మధురానుభూతులను కానుకగా చదివిస్తున్నా.. చదివేయండి..’
‘పల్లెకు పోదాం.. పారును చూద్దాం చలో చలో.. ’ ఎంత చలాకీ దేవదాసు! చిన్నప్పుడు రక్తం కారేలా పార్వతి నుదురు చెదరగొట్టి.. ‘నన్నూ చూడగానే చిన్ననాటి చనువు చూపేనో..’ అని రాగాలు ఎలా తీస్తూ వస్తున్నాడో చూడండి! అయినా ఇప్పుడెందుకు రావడం? ఎందుకురాడు! తెలుగునాట సప్తతి వసంత ఉత్సవాల కోసం వస్తున్నాడు. తెలుగు దేవదాసుకు అచ్చంగా 70 ఏండ్లు. 1953 జూన్ 26న వెండితెరపై మనవాడు చల్లిన మత్తు ఇప్పటికీ అంతే కొత్తగా ఉంది!! ఈ చిత్ర దర్శకుడు రాఘవయ్య ఇంటిపేరు వేదాంతం. ప్రతి సన్నివేశంలో ఎంత వేదాంతం రంగరించాడో కదా! ఇక సీనియర్ సముద్రాల పాటలకు దేవదాసు సంగతేమో కానీ, వాటిని విన్నవారంతా మత్తులోకి జారిపోయారు. ఎంతలా అంటే.. పొరపాటున దారితప్పితే ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..’ అనేంతలా, బతుకు భారం అనిపించినప్పుడల్లా ‘జగమే మాయ.. బతుకే మాయ..’ అని తనను తాను సంబాళించుకునేంతలా!! సి.ఆర్.సుబ్బరామన్ సంగీతమైతే మరీనూ.. సాహిత్యం మధ్యలో వచ్చే వాద్యఘోషనూ బుర్రలోకి ఎక్కించేశాడు. అక్కినేని, సావిత్రి, ఎస్వీ రంగారావు, సీఎస్సార్ ఈ నటులంతా కలిసికట్టుగా పులియబెట్టిన ఆ పాత ‘మధు’రం దేవదాసు. కాలం గడిచే కొద్దీ మధువు రుచి పెరిగినట్టు.. 70 ఏండ్ల దేవదాసూ అంతే!! డబ్బు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి ఆ చిత్రాన్ని మనసుతో చూడండి! సినిమా విషాదాంతమే అయినా నచ్చుతుంది. పిరికివాడిగా కనిపించిన దేవదాసును ధైర్యంగా ప్రేమిస్తాం.
‘సీత.. సీత..’ శ్రీరామచంద్రుడి ఆక్రందన ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. లోకపావని తన తల్లి భూదేవి గర్భంలోకి వెళ్లిపోతున్న దృశ్యం ఎలా మర్చిపోగలం? ‘ఇహపర సుఖములనొసగే సీతారామ కథను వినరయ్యా’ అంటూ రామచరితను దృశ్యకావ్యంగా చూపించిన చిత్రం ‘లవకుశ’. తెలుగువారికి రాముడంటే.. ఎన్టీ రామారావు అని రూఢి చేసిన సినిమా ఇది. అలాగే అంజలీదేవి రూపంలో సీతమ్మనూ పరిచయం చేసింది. సి.పుల్లయ్య, ఆయన తనయుడు సీఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఐదేండ్లపాటు సాగింది. 1963 మార్చి 29న విడుదలైన లవకుశ ఈ ఏడాది షష్టిపూర్తి జరుపుకోనుంది. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా ఏదో ఒక చానల్లో ఈ చిత్రం ప్రసారం అవుతూనే ఉంటుంది. మనమూ చూస్తుంటాం. లవకుశ పాత్రలు ధరించిన చిన్నారుల నటన ఆ చిత్రానికి మరింత వన్నె తెచ్చింది. ఈ చిత్ర విజయంలో పాటలు ప్రముఖ పాత్ర పోషించాయి. ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో..’ పాట నానుడిగా తెలుగువారి నోట నేటికీ నానుతూనే ఉంది.
నేలకు, రైతుకు విడదీయరాని బంధం. ఈ అనుబంధాన్ని హృద్యంగా తెరకెక్కించిన చిత్రం ‘దో బీఘా జమీన్’. బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1953లో మేటి చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. కథలోకి వెళ్తే.. శంభు ఒక రైతు. అతనికి రెండు బీఘాల (ఎకరం పావు) పొలం ఉంటుంది. కొందరు వ్యాపారులు ఊళ్లో చక్కెర పరిశ్రమ నెలకొల్పాలని భావిస్తారు. రైతుల పొలాలు స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. శంభు తన పొలం ఇవ్వడానికి ఒప్పుకోడు. పొలం మీద తీసుకున్న అప్పు రూ.235 మూడు నెలల్లోగా తీర్చేయాలని హెచ్చరిస్తాడు షావుకారు. ఆ డబ్బు సంపాదించడానికి శంభు కలకత్తా వెళ్తాడు. అక్కడ రిక్షా లాగుతాడు. అయితే, గడువు తీరేలోపు మొత్తం సొమ్ము కూడబెట్టలేకపోతాడు. శంభు మళ్లీ ఊరికి వెళ్లేసరికి అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతుంటుంది. అతను కన్నీటిపర్యంతం అవుతాడు. సంక్షిప్తంగా కథ ఇదే అయినా.. భావోద్వేగాలను పండించిన తీరు హృదయాన్ని తాకుతుంది.
ప్రేమకు చిరునామా తాజ్మహల్. ఈ శ్వేతసౌధం నిర్మాణానికి మొగల్ చక్రవర్తి షాజహాన్కు ఆయన భార్య ముంతాజ్పై ఉన్న అపారమైన ప్రేమ నేపథ్యంగా నిలిచింది. ఆ ప్రేమకథనే ‘తాజ్మహల్’ చిత్రంగా తెరకెక్కించారు దర్శకుడు సాదిఖ్. షాజహాన్గా ప్రదీప్కుమార్, ముంతాజ్గా బీనారాయ్ నటించారు. పేరుమోసిన ప్రేమకథ కావడంతో 1963లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లే రాబట్టింది. అరవై ఏండ్లు కావొస్తున్నా ఈ చిత్రంలోని పాటలు నేటికీ అలరిస్తున్నాయి. ‘జో వాదా కియావో.. నిభానా పడేగా..’, ‘జో బాత్ తుఝ్మే హై!..’, ‘పావ్ ఛూ లేనే దో..’ పాటలను వివిధ భారతి ‘మన్ చాహే గీత్’లో శ్రోతలు కోరుకుంటూనే ఉన్నారు. క్లాసిక్స్లో ఒకటిగా నిలిచిపోయిన ‘తాజ్మహల్’ను ఓ సారి చూసేద్దాం.
Nayanthara | అందుకే ఈవెంట్స్కు వెళ్లడం మానేశా.. హాట్ టాపిక్గా నయనతార కామెంట్స్