Kaikala Satyanarayana As a Producer | కైకాల సత్యనారాయణ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. 1983లో రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ‘ఇద్దరు దొంగలు’ అనే సినిమాను తన తమ్ముడు కే.నాగేశ్వర రావుతో కలిసి నిర్మించాడు. కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, శోభన్ బాబులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘దో ఆంఖే బారా హాత్’ అనే హిందీ సినిమా నుండి ప్రేరణ పొంది పి. సత్యానంద్ ఈ సినిమా కథను రాశాడు. 1984 జనవరి 14న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇక మొదటి సినిమాతోనే కైకాల నిర్మాతగా సక్సెస్ సాధించాడు.
ఆ తర్వాత చిరంజీవితో 1990లో కొదమ సింహం సినిమా రూపొందించారు. చిరంజీవి పూర్తి స్థాయిలో నటించిన తొలి కౌబాయ్ చిత్రమిదే. పలు హాలీవుడ్ సినిమాలను బేస్ చేసుకుని నాగేశ్వర్ రావు, విజయేంద్రప్రసాద్, శివశక్తి, పరుచూరి బ్రదర్స్ కలిసి ‘కొదమ సింహం’ కథను తయారు చేశారు. దర్శకుడిగా కైకాల నాగేశ్వరరావు తన క్లాస్మేట్ మురళిమోహన్రావును ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి అప్పట్లోనే 4కోట్ల బడ్జెట్ అయింది. ఖర్చుకు వెనకాడకుండా కైకాల ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 9, 1990 లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా 20 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది.
‘కొదమ సింహాం’ తర్వాత నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని అక్కినేని నాగేశ్వరరావుతో ‘బంగారు కుటుంబం’ సినిమాను నిర్మించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ హీరో విక్రమ్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీశారు. ఈ సినిమాకు నిర్మాతగా కైకాల నంది పురస్కారం అందుకున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో ‘ముద్దుల మొగుడు’ సినిమా రూపొందిచారు. కోదండి రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పోసాని కృష్ణ మురళి సంభాషణలు అందించారు. వీటితో పాటుగా పలు సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు.