Esha Gupta | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలకి ఆటంకం ఏర్పడింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల నేపథ్యంలో పలు దేశాలు ఎయిర్స్పేస్ను మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ఈషా గుప్తా అబుదాబిలో చిక్కుకుపోయి, మూడు రోజుల తర్వాత మార్చి 2న సురక్షితంగా ఢిల్లీకి చేరుకుంది. ఇంటికి చేరిన అనంతరం ఆ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఫిబ్రవరి 28న నేను ఎయిర్పోర్టుకు చేరుకున్నాను. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఎయిర్పోర్ట్ను మూసివేశారు. చుట్టూ గందరగోళం.. ఏం జరుగుతుందో ఎవరికీ స్పష్టంగా తెలియని పరిస్థితి అని ఈషా తెలిపారు. కొద్ది సేపటికే క్షిపణి దాడుల వార్తలు రావడం ప్రారంభమయ్యాయని, తర్వాతి క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొన్నదని ఆమె పేర్కొన్నారు. అక్కడున్న వారు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాడుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ గడిపారు. ఆ మూడు రోజులు నిజంగా మానసికంగా చాలా కష్టంగా అనిపించాయి అని చెప్పారు.
ఈ క్లిష్ట సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈషా గుప్తా ప్రశంసించారు. ఎయిర్పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులకు ప్రత్యేకంగా భోజనం, తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించారు. నేను చెక్-ఇన్ పూర్తి చేయకముందే ఎయిర్పోర్ట్ మూసివేయడంతో తిరిగి అబుదాబిలోని హోటల్కు వెళ్లాను. అక్కడి సిబ్బంది ముఖాల్లో భయం కనిపించినా, ప్రయాణికులకు ఎక్కడా ఒత్తిడి కలగకుండా ఎంతో సమర్థంగా పనిచేశారు అని ఈషా పేర్కొన్నారు. ఇక ఈషా గుప్తాతో పాటు దుబాయ్లో తమిళ స్టార్ అజిత్ కుమార్, టాలీవుడ్ నటుడు మంచు విష్ణు, నటి సోనాల్ చౌహన్, బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈషా సురక్షితంగా భారత్ చేరుకోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నప్పటికీ, మిగిలిన వారంతా సురక్షితంగానే ఉన్నారనే అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు.