సరైన మాస్ క్యారెక్టర్ పడిందంటే చెలరేగిపోవడం రవితేజకు పరిపాటే. రెండేళ్ల క్రితం ‘ధమాకా’తో బాక్సాఫీస్ దగ్గర ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో వందకోట్ల విజయాన్ని అందుకున్నారాయన. ప్రస్తుతం అదే తరహాలో ఆయన చేస్తున్న సినిమా ‘మాస్ జాతర’. రచయిత భాను భోగవరపు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. రవితేజ, డా.రాజేంద్రప్రసాద్ ఇందులో తాతామనవళ్లుగా నటిస్తున్నారని తెలిసింది. వారి కాంబినేషన్ సీన్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తాయని, థియేటర్లన్నీ నవ్వులతో మారుమోగిపోతాయని చిత్రబృందం చెబుతున్నది. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాలో రవితేజ మెమరబుల్ బ్లాక్బస్టర్ ‘ఇడియట్’లోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..’ పాటని రీమిక్స్ చేస్తున్నారట. రవితేజ, శ్రీలీలపై ఈ పాట ఉంటుందట. మరి ప్రయత్నంలో అటు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, ఇటు డైరెక్టర్ భాను భోగవరపు ఏ మాత్రం సక్సెస్ అవుతారో చూడాలి.