Mamta Kulkarni | అలనాటి బాలీవుడ్ నటి మమతా కులకర్ణికి బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2016లో నటిపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. మమతా కులకర్ణిపై చర్యలు విచారకమని కోర్టు పేర్కొంది. ఈ కేసులో విచారణను కొనసాగించడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే తప్ప మరోటి కాదని జస్టిస్ భారతి డాంగ్రే, మంజుషా దేశ్పాండే ధర్మాసనం వ్యాఖ్యానించింది. జూలై 22 నాటి ఉత్తర్వుల్లో నటికి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలు ప్రాథమికంగా ఆమెపై నేరం చేసినట్లుగా పరిగణించేందుకు సరిపోవని పేర్కొన్నారు. వాస్తవానికి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం కింద 2016లో థానే పోలీసులు తనపై నమోదు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR)ను రద్దు చేయాలని 2018లో మమతా కులకర్ణి హైకోర్టును ఆశ్రయించారు.
మమత భర్త విక్కీ గోస్వామి ఈ రాకెట్కు ప్రధాన సూత్రధారిగా ఎఫిడ్రిన్ను తయారు చేసి సేకరించినట్లు భావించారు. ఈ కేసులో తనను ఇరికిస్తున్నారని ఆరోపించింది. 12 ఏప్రిల్ 2016న థానే పోలీసుల యాంటీ నార్కోటిక్స్ సెల్ విభాగం రెండు కార్లను అడ్డగించి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్-1985 ప్రకారం రెండు నుంచి మూడు కిలోగ్రాముల ఎఫిడ్రిన్ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత కార్ డ్రైవర్స్తో పాటు సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మమతా కులకర్ణి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆమెపై ఆరోపణలు కేవలం సహ నిందితుల వాంగ్మూలాలపైనే ఆధారపడ్డాయని.. ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. అయితే, ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం.. మమతా కులకర్ణిపై మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు ఛార్జిషీట్లో సమర్పించిన సాక్ష్యాలు సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కేసును కొట్టివేసింది.
ఇదిలా ఉండగా.. 1990వ దశకంలో భారతీయ చిత్ర పరిశ్రమలో మమతా కులకర్ణి ఓ వెలుగు వెలిగింది. బోల్డ్ క్యారెక్టర్స్కు పెట్టింది పేరుగా నిలిచింది. తన అందంతో బాలీవుడ్ను ఓ ఊపు ఊపేసింది. ఒంటిపై బట్టలు లేకుండా ‘డస్ట్ మ్యాగజైన్’ కవర్ పేజీలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటో షూట్ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేశాయి. కెరియర్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రూ.2వేలకోట్ల డ్రగ్స్ కేసులో మమతా కులకర్ణి అరెస్టు అయ్యారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. మమతా కులకర్ణి ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిని’ పేరుతో ఓ పుస్తకాన్ని సైతం రాసింది. హీరోయిన్గానే కాకుండా ఐటెమ్ సాంగ్స్తోనూ అభిమానులను అలరించింది.