చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. బాబీ దర్శకుడు. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ…‘ఈ సినిమా మేము ఊహించిన విజయాన్ని సాధించింది. ఈ సంతోషంలో మాటలు రావడం లేదు. మేము మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు చెప్పేది వినాలని అనుకుంటున్నాం. రవితేజ లేకుంటే మూవీ ఇంత బలంగా వచ్చేది కాదు.
దర్శకుడు బాబీ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. నాకున్న అనుభవంలో చెప్పిన సలహాలు పాటించాడు. దర్శకులు సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే పక్కాగా పేపర్ వర్క్ చేసుకోవాలి. స్పష్టత లేకుండా అదనంగా సీన్స్ చేయడం వల్ల నిర్మాతకు ఆర్థికంగా నష్టంతో పాటు నటీనటులకు శ్రమ పెరుగుతుంది. ఇది ఏ ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పడం లేదు. దర్శకులంతా ఇది పాటిస్తే అందరం బాగుంటాం’ అన్నారు. హీరో రవితేజ మాట్లాడుతూ…‘మా సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అన్నయ్య చిరంజీవితో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ మూవీ చేయాలని ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్, దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.