హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ పాలనలో గడిచిన ఏండ్లలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందుతున్నదని అన్నారు. ఈ సందర్భంగా గడిచిన ఏడేండ్లలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ప్రగతిని ఆయన వివరించారు.
రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ యాక్ట్-2018ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పంచాయతీలకు ప్రభుత్వం నెలనెలా రూ.308 కోట్లు విడుదల చేస్తున్నదని, ఇప్పటివరకు రూ.5993 కోట్లు కేటాయించింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రత పెంచాలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలు విజయవంతమయ్యాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 84 పంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉండగా, ప్రస్తుతం 12,669 పంచాయతీలకు ట్రాలీలతో సహా ట్రాక్టర్లు సమకూర్చామని తెలిపారు. రాష్ట్రంలో రూ. 1554 కోట్ల వ్యయంతో 12,751 వైకుంఠధామాలు నిర్మించామని తెలిపారు.
మిషన్ భగీరథ పథకం కింద 24543 ఆవాసాలకు సురక్షితమైన త్రాగునీరు నల్లాల ద్వారా సరఫరా అవుతున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద గడిచిన ఐదేండ్లలో రూ.32500 కోట్ల వ్యయం చేశాం. రూ.463 కోట్ల వ్యయంతో 2601 రైతు వేధికలు, రూ.743 కోట్ల వ్యయంతో 93328 కళ్లాలను నిర్మించాం. రూ. 115 కోట్లతో పల్లె పకృతి వనాలను పూర్తి చేశామని, వీటిలో 13లక్షల 87వేల మొక్కలను నాటాం. రూ. 319 కోట్లతో 12766 చెత్తను వేరుచేసే షెడ్లను నిర్మించాం.
ఉపాధి హామీ పథకం కింద గత ఆర్థిక సంవత్సరం 15 కోట్ల 5 లక్షల పనిదినాలను కల్పించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల పనిదినాలను లక్ష్యంగా నిర్ణయించాం. గ్రామీణ ప్రాంతాల్లోని 272500 మహిళా స్వయం సహాకార సంఘాలకు రూ. 10441 కోట్ల రూపాయలను, స్త్రీనిధి పథకం ద్వారా 158679 సంఘాలకు రూ. 2380 కోట్ల రూపాయలను రుణాలను అందించాం.
తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం, రాష్ట్రంలో 8690 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పుడు ఈ సంఖ్య 12769కి పెంచాం. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 2020లో 11 జాతీయస్థాయి అవార్డులు, 2021లో 12 జాతీయస్థాయి అవార్డులు, ఈ-పంచాయతీ అవార్డులు లభించాయని మంత్రి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్ బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 29291 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు.