యాదాద్రి, జూలై2: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను అర్చకులుభక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వందలాది మంది మహిళా భక్తు లు సేవలో పాల్గొని శ్రీలక్ష్మి అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. బాలాలయ ముఖమండపంలో లక్ష్మీనరసింహస్వామి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా రూ.516 టికెట్ తీసుకున్న భక్తులు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను స్వామివారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. ఉప ప్రధానార్చకుడు బట్టర్ సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు ఈ పూజలను నిర్వహించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయ ముఖమండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడారు. అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
నిత్యపూజల కోలాహలం
యాదాద్రిలో ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో అర్చకు లు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేకపూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా స్వామివారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే స్వామి వారి నిత్యకల్యాణంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకున్నసూర్యాపేట జడ్పీ చైర్పర్సన్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్ కుటుంబ సమేతం గా దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
పాతగుట్ట స్వామివారి గర్భాలయం పునరుద్ధరణ పనులు
లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గతేడాది స్వామివారికి బంగారు కవచమూర్తులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కవచమూర్తుల దర్శనానికి వచ్చే భక్తులకు అవి స్పష్టంగా కనిపించకపోవడంతో దాతల సహకారంతో నూతనంగా గర్భాలయ ద్వారం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 10.20 గంటలకు ద్వార పూజ చేసి తొలగిస్తున్నట్లు , నూతన గర్భాలయ ముఖద్వారం 7వ తేదీన ఉదయం 11.50 గంటలకు ఆగమశాస్త్రం ప్రకారంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి పాతగుట్ట ముఖ ద్వారం ఏర్పాటు పనులు పూర్తయ్యేవరకు స్వామివారి గర్భాలయ దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థ్ధం స్వామివారి కవచమూర్తుల దర్శనం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న ట్లు, స్వామివారి అభిషేకం ఆంతరంగికంగా నిర్వహించి, మిగి తా ఆర్జిత సేవ పూజలను యథావిధిగా కొనసాగిస్తామన్నారు.