భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సినిమా థియేటర్లలో ఉదయం ఆట గాంధీ చిత్రాన్ని చూపిస్తున్నది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని ప్రశంసించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవి థియేటర్లో విద్యార్థులతో కలిసి ఆయన గాంధీ చిత్రాన్ని చూశారు. అనంతరం శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. ‘విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. గాంధీజీ సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టిన సన్నివేశాలకు విద్యార్థులు దేశభక్తితో స్పందిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మీరూ ఈ సినిమాను పిల్లలతో కలిసి చూడండి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను సీఎంవో, మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్లకు ఆయన ట్యాగ్ చేశారు.