Dhanush | ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్లో చెన్నై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో సీఎస్కే అద్భుత విజయాన్ని అందుకుని ఈ సీజన్లో ముంబైపై రెండోసారి గెలిచింది.పసుపు జెండాలతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోగా, అభిమానుల హర్షధ్వానాలతో ‘ఎల్లో ఫీవర్’ కనిపించింది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రముఖ నటుడు ధనుష్ తన కుమారుడు లింగాతో కలిసి స్టేడియానికి విచ్చేశారు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు సందడి చేశారు. చెన్నై ఆటగాళ్ల ప్రతీ బౌండరీ, సిక్స్కు ఆయన ఉత్సాహంగా స్పందిస్తూ అభిమానులను అలరించారు. అదే గ్యాలరీలో అజిత్ కుమార్ సతీమణి, మాజీ నటి షాలిని కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మ్యాచ్ విషయానికి వస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (29), సూర్యకుమార్ యాదవ్ (35), తిలక్ వర్మ (37) రాణించినా, చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి స్కోరును నియంత్రించారు. ముఖ్యంగా అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్ కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ను చెన్నై వైపు తిప్పారు. అనంతరం లక్ష్య ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు సమష్టిగా రాణించి విజయాన్ని సులభంగా అందుకున్నారు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో చెన్నై తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది.
ఇదిలా ఉంటే ధనుష్ నటించిన కర మూవీని రైతుల సమస్యలు, ముఖ్యంగా లోన్ల విషయంలో జరిగే మోసాలను ప్రధానంగా చేసుకుని రూపొందించారు. కమర్షియల్ యాంగిల్ లో మిశ్రమ స్పందన ఉన్నా ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. అయితే ధనుష్ గత సినిమాలతో పోల్చితే కాస్త డల్ గానే ఉన్నా.. ఇప్పుడున్నపరిస్థితుల్లో దీనికి బెటర్ గానే వసూళ్లు రావడం విశేషం అని చెప్పొచ్చు. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు పెరగడం మరో విశేషంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు.