నిజామాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దుష్ఫలితాలు అంతకు మించి ఉన్నాయన్నది వాస్తవం. ఇప్పటికే అనేక సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మాధ్యమాల ఉచ్చులో బాల్యం బందీ అవుతున్నది. ఇదే పెద్ద ప్రమాదమంటున్నారు నిపుణులు. నిజానికి కొవిడ్-19 వల్ల ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగం ఆన్లైన్ క్లాస్ల వైపునకు మళ్లింది. ఆ సమయంలో పిల్లల విద్యను కొనసాగించేందుకు తల్లిదండ్రులు అనివార్యంగా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు వంటివి కొనిచ్చారు. అప్పుడు పిల్లలు వీటిని క్లాస్లు వినేందుకే వినియోగించారు. మొదట్లో ఇది బాగానే ఉన్నది. వెబ్సైట్కు లాగిన్ కావడం, క్లాస్ల పేరిట సెల్ఫోన్ వినియోగించడం అనేది సరదాగా ఉండేది. ఇప్పుడదే క్రమంగా వ్యసనంగా మారింది. ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్లు లేకపోయినా చాలా మంది పిల్లలు డిజిటల్ పరికరాలతో నిమగ్నమవడం కనిపిస్తున్నది. ఏ ఇంట్లో చూసినా సెల్ఫోనో, ట్యాబో, ల్యాప్టాపో.. లేదంటే టీవీతోనో గడిపే దృశ్యాలే కనిపిస్తున్నాయి. గంటల కొద్దీ అందులోనే నిమగ్నమవుతున్నారు. కొంత మంది పిల్లలైతే స్టడీ పేరిట రూం తలుపులు వేసుకొని సోషల్మీడియాలో లీనవుతున్నారు. ఇంకొంత మంది పిల్లలైతే బయటకు శబ్దం రాకుండా ఇయర్ ఫోన్లు పెట్టుకుంటున్నారు. అయితే, డిజిటల్ పరికరాలను గంటల తరబడి వాడడం.. సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడం.. వివిధ వెబ్సైట్లకు వెళ్లడం.. వంటివి విద్యార్థులపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటి ద్వారా యాంత్రిక జీవనానికి అలవాటు పడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
పెరుగుతున్న మానసిక ఒత్తిడి
నిన్నామొన్నటి వరకు ఆన్లైన్ క్లాసులకు స్మార్ట్ఫోన్ తప్పని సరైంది. దాంతో పిల్లలకు సెల్ఫోన్ వినియోగించడం తెలిసింది. ఇదే క్రమంలో పిల్లలు పట్టు తప్పుతున్నారని అనేక సంస్థలు తమ అధ్యయనాల్లో వెల్లడించాయి. ప్రధానంగా ఆన్లైన్ గేమ్లకు బానిసకావడం. అశ్లీల వెబ్సైట్లు చూడడం, లేదా ఉద్రిక్తతలు, రెచ్చగొట్టే అంశాల వైపు వెళ్లడం, భయానక దృశ్యాలు చూడడం వంటివి చేస్తున్నారు. దీని వల్ల పిల్లల్లో క్రియాశీలత లోపించడమే కాదు, మానసిక ఒత్తిడి పెరుగుతున్నది. అత్యధిక సమయం స్మార్ట్ ఫోన్లలోనే గడుపుతున్న పిల్లలను తల్లిదండ్రులు మందలిస్తే విచిత్రంగా.. వింతగా స్పందిస్తున్నారు. ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. గట్టిగా అరుస్తున్నారు. తల్లిదండ్రులతోనూ, ఇంట్లో వాళ్లతోనూ మాట్లాడకుండా మారాం చేస్తున్నారు. క్షణికావేశంలో ఏమిచేస్తున్నారో వారికి తెలియని పరిస్థితి. ఈ తరహా కేసులు ఇటీవలి కాలంలో చాలా పెరుగుతున్నాయంటున్నారు వైద్యులు. వీటిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. పిల్లల ఎదుగుదలకు పెను ప్రమాదమంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు.
v అడిక్షన్ పెరుగుతోంది..
ఆన్లైన్ క్లాస్ల కోసం తల్లిదండ్రులు అనివార్య పరిస్థితుల్లో మొబైల్ఫోన్లు, ల్యాప్టాప్లు కొనిచ్చారు. అలా పిల్లలు స్క్రీన్కు బాగా అలవాటయ్యారు. అది చదువుకు ఉపయోగపడింది. ఎడ్యుకేషన్ కంటిన్యూ అయింది. అయితే, క్లాస్లు ముగిసిన తర్వాత పిల్లలు వేరే కంటెంట్లోకి వెళ్లడానికి అలవాటుపడ్డారు. సెల్ఫోన్ అడిక్ట్ కావడం వల్ల నియంత్రణ కోల్పోవడం మొదలు పెట్టారు. దాంతో సహజంగా ఉండాల్సిన ఇంట్రాక్షన్ తగ్గింది. అది కుటుంబంతో కావచ్చు లేదా ఫ్రెండ్స్తో కావచ్చు. లేదంటే తమ వయస్సు వారితో కావచ్చు. ఆర్టిఫిషియల్ ప్రపంచానికి అంకితమయ్యారు. ఇది మనకు ప్రారంభంలో కనిపించింది. ఇంకా సమయం గడిచినా కొద్దీ అడిక్షన్ పెరిగి పిల్లల్లో నిద్రలేమి, తలనొప్పి, కోపం, పెద్దలపై అరవడం, వేరే ఏ పనులూ చేయకుండా ఉండడం వంటి ఆరోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. ఉదాహరణకు చూస్తే ఇండోర్ ఆటలను దూరం పెట్టి స్మార్ట్ఫోన్లో నిమగ్నం కావడం పెను ప్రమాదానికి దారితీస్తున్నది.
ప్రతి ఇంట్లోనూ మొబైల్ ఫ్రీజోన్లు ఉండాలిసెల్ఫోన్లకు అడిక్టవుతున్న పిల్లల్లో ఎటువంటి మార్పులు కనిపిస్తాయి? వాటినుంచి ఎలా బయట పడేయాలి? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అలక్ష్యం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అన్న అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు..
ఇలా అధిగమించవచ్చు.
మార్పు అనేది తల్లిదండ్రుల నుంచే మొదలు కావాలి. మొబైల్పై నియంత్రణ అనేది వారి నుంచే ప్రారంభమవ్వాలి. మొబైల్ ఫోన్ వాడడం తగ్గించాలి. అవసరం ఉంటే తప్ప ఇతర వ్యక్తులతో మాట్లాడవద్దు. అప్పుడే తల్లిదండ్రులను చూసి పిల్లలు తమ వాడకం తగ్గించుకుంటారు.
అలాగే ప్రతి ఇంట్లోనూ మొబైల్ ఫ్రీ జోన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు బెడ్రూం, డైనింగ్ ప్లేస్లో ఫోన్ వాడకుండా ఉండాలి. అక్కడ తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడవద్దు.
ప్రతి రోజూ కొద్ది సమయం స్క్రీన్ లేని టైంగా డిక్లేర్ చేసుకోవాలి. ఇది ప్రతి ఇంట్లోనూ జరగాలి. వీటి ద్వారా మెల్లమెల్లగా పిల్లల యూజెస్ తగ్గుతుంది.
అలాగే పిల్లలు తొందరగా షార్ట్ ప్యాన్ అవుతారు. అంటే స్వల్ప వ్యవధిలో మైండ్ డైవర్ట్ అవుతుంది. పిల్లలకు ఒక గేమ్ నేర్పించి.. ఎప్పుడూ అదే ఆడాలంటే ఆడరు. బోర్గా ఫీలవుతారు. అందుకే తరచూ కొత్త కొత్త గేమ్లు నేర్పాలి. ఇవాళ షటిల్ ఆడితే, రేపు క్యారం, ఎల్లుండి చెస్ ఆడాలి. ఇలా చేయడం వల్ల ఆలోచన శక్తి పెరగడంతోపాటు యాక్టివిటీ పెరుగుతుంది. ఈ మార్పు అనేది తల్లిదండ్రుల నుంచి రావాలి. ఇలా ఒకటి రెండు నెలలపాటు సమయం దొరికనప్పుడల్లా మొత్తం కుటుంబం కలిసి చేస్తే కచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది.
తక్షణ ప్రభావం..
ఇలా అధిగమించాలి..
డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలి. స్మార్ట్ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, కంప్యూటర్లు వంటి వాటిని ఆయా రంగాల వారు కేవలం వారి అకాడమిక్ ప్రయోజనం కోసమే మాత్రమే ఉపయోగించాలి. వినోదం కోసం, అలాగే టైంపాస్ చేయడం కోసం వినియోగించవద్దు.
ఒకవేళ తప్పని పరిస్థితుల్లో డిజిటల్ పరికరాలను ఉపయోగించాల్సి వస్తే, టేబుల్ ముందు ఉండే కుర్చీ సౌకర్యవంతంగా ఉండాలి. మనం వినియోగించే డిజిటల్ పరికరం ఒకటి లేదా రెండు అడుగుల దూరంలో ఉంచాలి. గది మొత్తం ప్రకాశవంతంగా ఉండాలి. రాత్రయితే గదిలోని అన్ని లైట్లు ఆన్లో ఉంచాలి.
పిల్లలు, పెద్దవాళ్లు ఎవరైనా సరే ప్రతి 20 నిముషాలకోసారి స్క్రీన్వైపు చూడడం మానేయాలి. కొంత విశ్రాంతి తీసుకోవాలి. దూరపు వస్తువులను చూడాలి. ఉద్దేశ పూర్వకంగా కనురెప్పలు మూస్తూ తెరువాలి. దీని వల్ల కంటిపై భాగం తేమగా ఉంటుంది.
పిల్లలకు దూరదృష్టి పెరగాలంటే ఇంట్లో డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రకాల ఆటలు ఆడించాలి. అవుట్డోర్ అయితే పిక్నిక్ లాంటివాటికి తీసుకెళ్లాలి. ప్రస్తుతం కరోనా ఉంది కాబట్టి.. బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి. ఈ సమయంలో మరింత జాగ్రత్త అవసరం.ముందునుంచే జాగ్రత్తలు పాటించకపోతే కళ్ల జబ్బులను కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఒక్క కళ్ల జబ్బులే కాదు, ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.