Cockroach Janata Party | ఇటీవల సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. రాజకీయ వ్యంగ్య ధోరణితో యువతలో వేగంగా ప్రాచుర్యం పొందిన ఈ డిజిటల్ ఉద్యమానికి చెందిన ఖాతాను భారతదేశంలో నిలిపివేసినట్లు ఎక్స్ సంస్థ ప్రకటించింది. చట్టపరమైన అభ్యర్థనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన వ్యక్తిగత ఖాతా ద్వారా వెల్లడించారు. అకౌంట్ నిలిపివేసిన విషయానికి సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ, “మేము ముందుగానే ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాను భారతదేశంలో బ్లాక్ చేశారు” అని పేర్కొన్నారు.
ఈ పరిణామం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. పలువురు ప్రముఖులు దీనిపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ, “భారతదేశంలో ఈ ఖాతాను ఎందుకు నిలిపివేశారు?” అంటూ ప్రశ్నించారు. ఇక స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ తనదైన శైలిలో స్పందిస్తూ దీనిని “స్ట్రైసాండ్ ఎఫెక్ట్”గా అభివర్ణించారు. ఏదైనా విషయాన్ని దాచడానికి లేదా పరిమితం చేయడానికి చేసిన ప్రయత్నం దానిని మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితిని సైకాలజీలో స్ట్రైసాండ్ ఎఫెక్ట్గా పిలుస్తారు.
మరోవైపు సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. యువత తమ అభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తపరచడం సమాజానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కొత్తగా ప్రారంభించిన బ్యాకప్ ఖాతాకు సంబంధించిన పోస్టును కూడా ఆయన పంచుకున్నారు. నటి సనం శెట్టి కూడా ఈ ఉద్యమంపై స్పందించారు. తక్కువ సమయంలోనే యువతలో ఈ స్థాయి ఆదరణ పొందడం విశేషమని, ఈ ఉద్యమం ఏ దిశగా ముందుకు సాగుతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
అసలు కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏమిటి అనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఉద్యమాన్ని మే 16న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే ప్రారంభించారు. ఇటీవల యువతపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిరసనగా ఈ వ్యంగ్యాత్మక డిజిటల్ ఉద్యమం రూపుదిద్దుకుంది. యువత తమ అసంతృప్తిని శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తపరచడానికి దీనిని వేదికగా ఉపయోగిస్తున్నారు. ఇది అధికారిక రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ, ఒక ప్రత్యేక మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ ఉద్యమానికి సోషల్ మీడియాలో భారీ ఆదరణ లభించింది.