Boney Kapoor| బాలీవుడ్ దిగ్గజ నటి శ్రీదేవి సి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అగ్రనటిగా రాణించిన ఆమె తన జీవితంలో ఎన్నో విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేశారు. ఆమె మరణానంతరం భర్త బోనీ కపూర్ మరియు కూతుళ్లు జాన్వీ, ఖుషీకు ఆ ఆస్తులపై అధికారం ఉన్నప్పటికీ, తాజాగా చెన్నైలోని ఓ స్థిరాస్తి విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది. 1988లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్లో శ్రీదేవి ఓ స్థిరాస్తిని ఎం.సి. సంబంద ముదలైర్ అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేశారు. అప్పట్లో ముదలైర్కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి సమ్మతితోనే ఈ ఆస్తి శ్రీదేవి పేరుకు మారింది.
అయితే తాజాగా, ముగ్గురు వ్యక్తులు “మేము ముదలైర్ రెండో భార్య పిల్లలము” అంటూ ముందుకు వచ్చారు. తాము ఆ స్థిరాస్తిపై హక్కు కలిగిన వారమని పేర్కొంటూ, ఆ ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన బోనీ కపూర్, 2025 ఏప్రిల్ 22న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిటిషన్ ప్రకారం, ముదలైర్ రెండో భార్యను 1975లో వివాహం చేసుకున్నారని ఆ ముగ్గురు పేర్కొంటున్నారు. కానీ ముదలైర్ మొదటి భార్య మాత్రం 1999లోనే మృతిచెందారు. అంటే మొదటి భార్య బతికి ఉన్న సమయంలో రెండో వివాహం జరగడం వలన, హిందూ వారసత్వ చట్టం ప్రకారం, రెండో భార్య పిల్లలు చట్టబద్ధ వారసులుగా గుర్తింపు పొందలేరు అని కోర్టు స్పష్టం చేసింది.
ఈ ముగ్గురు వ్యక్తులు తాంబరం తాలూకా తహశీల్దార్ వద్ద నుండి చట్టబద్ధమైన వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. కానీ అది మోసపూరితంగా పొందిన పత్రం అని బోనీ కపూర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తహసీల్దారుని ఆదేశించింది హైకోర్టు. ఈ ఆస్తి వివాదం ప్రస్తుతం తుది నిర్ణయ దశలో ఉంది. తహశీల్దార్ సమర్పించే నివేదిక ఆధారంగా, తదుపరి చర్యలు తీసుకోనున్నారు. బోనీ కపూర్ వాదనకు బలముండడంతో, రెండో భార్య పిల్లలకు హక్కు కలుగదని న్యాయనిపుణులు భావిస్తున్నారు.