తిప్పాపూర్లో పూర్తయిన వందపడకల వైద్యశాల
20కోట్లతో నిర్మాణం.. ఆధునిక వసతుల కల్పన
మంత్రి కేటీఆర్ పర్యవేక్షణతో శరవేగంగా పూర్తి
మొదటగా కరోనా వైద్యానికి 50 పడకలు రెడీ
ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బంది నియామకం
నేడు అమాత్యుడి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
వేములవాడ, మే 27: ధార్మిక క్షేత్రంలో వంద పడకల దవాఖాన రెడీ అయింది. వేములవాడ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యంగా తిప్పాపూర్లో కార్పొరేట్కు దీటుగా రూపుదిద్దుకున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో శరవేగంగా పూర్తయి, ఆధునిక వసతులు, వైద్య పరికరాలతో ప్రారంభానికి ముస్తాబైంది. కొవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మొదటగా 50 పడకలతో కరోనా చికిత్సనందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వైద్యులు, సిబ్బంది నియామకం పూర్తి కాగా, నేడు అమాత్యుడి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నది.
వేములవాడ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా తిప్పాపూర్లో నాలుగున్నర ఎకరాల స్థలంలో వంద పడకల దవాఖాన సిద్ధమైంది. జీ-ప్లస్1 తో దాదాపు 79వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణమైంది. వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు ఇతరత్రా సిబ్బందికి కూడా వసతి సముదాయాలను త్వరలో నిర్మించనున్నారు. వేములవాడ పట్టణంతోపాటు మధ్యమానేరు ముంపునకు గురవుతున్న ఆరు గ్రామాల ప్రజలకు ఈ దవాఖాన అత్యంత చేరువ కానున్నది. ఇక జిల్లా కేంద్రమైన సిరిసిల్లకు వెళ్లే దారిలోనే ఈ దవాఖాన ఉన్నది.
ఆధునిక వైద్య సదుపాయాలు..
వంద పడకల దవాఖానను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. అత్యవసర వార్డు, ఆపరేషన్ థియేటర్లు, గుండె పరీక్షల నిర్ధారణ, ఎక్స్రే, బ్లడ్బ్యాంక్, ల్యాబ్, మందుల దుకాణంతోపాటు ఆరోగ్యమిత్ర, ఆయుష్ ఆరోగ్యశ్రీ లాంటి సదుపాయాలతో కూడిన ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయనున్నారు. స్త్రీ వైద్య నిపుణురాలు, ఎముకల వైద్యులు, చెవి, ముక్కు, గొంతు, గుండె జబ్బుల వైద్యులు, చిన్న పిల్లల వైద్యులతో పాటు అవసరమయ్యే అన్ని రకాల వైద్యులు కూడా అందుబాటులో ఉండనున్నారు. ఇక రోగులకు అవసరమయ్యే అంబులెన్స్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
అందుబాటులో వైద్యులు, సిబ్బంది..
వైద్య సేవల కోసం వైద్యులు, ఇతర విభాగాల ఉద్యోగుల నియామకానికి ఇదివరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఆరుగురు వైద్యులు, 60 మంది సిబ్బంది నియామకం పూర్తయింది. నేటి నుంచి విధులకు హాజరుకానున్నారు. దవాఖానలో ఇక నుంచి అన్ని రకాల వైద్యసేవలు ప్రజలకు అందనున్నాయి.
మొదట 50పడకలతో కరోనా వైద్య సేవలు..
కొవిడ్ నేపథ్యంలో వేములవాడ ఏరియా దవాఖానలో ప్రస్తుతం 50 పడకలను సిద్ధం చేశారు. కరోనా వైద్య సేవలను తక్షణమే అందించే విధంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు ప్రత్యేక చొరవ చూపి పనులను వేగవంతం చేసి అందుబాటులోకి తెచ్చారు. రెండు ఐసీయూలతోపాటు ప్రత్యేక గదులతో కలిపి 50పడకలను సిద్ధం చేశారు. ఇందుకు అవసరమైన ఆక్సిజన్ నిల్వలతో పాటు ఆక్సిజన్ సరఫరా చేసే యంత్రాలు, మందులు ఇలా అవసరమైన ప్రతి ఒక్కటీ అందుబాటులోకి తెచ్చారు.
నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం..
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం సాయంత్రం వేములవాడకు రానున్నారు. సాయంత్రం 4గంటలకు ఏరియా దవాఖానను ప్రారంభించనున్నారు. ఆ వెంటే వైద్య సేవలు అందుబాటులోకి రానుండగా, వేములవాడ నియోజకవర్గ ప్రజలకు వైద్యం మరింత చేరువకానున్నది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జడ్పీ చైర్ పర్సన్ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ అధ్యక్షురాలు మాధవితో పాటు వైద్య అధికారులు, వైద్యులు హాజరుకానున్నారు.
అన్ని రకాల సేవలందిస్తాం..
వేములవాడ ఏరియా దవాఖానలో ఇకపై అన్ని రకాల వైద్య సేవలు అందిస్తాం. ప్రస్తుత కరోనా పరిస్థితులల్లో ప్రజలకు అత్యవసర సేవల నిమిత్తం 50 పడకలను సిద్ధం చేశాం. ఇందుకు అవసరమయ్యే పూర్తిస్థాయి వైద్య పరికరాలు, మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర సేవల విభాగంలో కరోనా వైద్య సేవలు అందుతాయి. సాధారణ ఓపీ బ్లాక్లో ప్రజలకు వైద్య సేవలు కూడా ప్రతిరోజు అందుతాయి. -రేగులపాటి మహేశ్ రావు, వైద్యాధికారి (వేములవాడ)