న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతున్నదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. మరోవైపు దేశ వ్యాప్తంగా 66 జిల్లాల్లో పది శాతంపైగా కరోనా పాజిటివ్ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. జూలై 8 నాటికి 17 రాష్ట్రాల్లోని 66 జిల్లాల్లో పది శానికిపైగా కరోనా పాజిటివ్ రేటు ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్లో పది, రాజస్థాన్లోని పది జిల్లాల్లో గరిష్ఠ పాజిటివ్ రేటు నమోదైంది. మణిపూర్లో 9 జిల్లాలు, కేరళలో 8, మేఘాలయలో 6, అస్సాంలో 4, సిక్కింలో 4, త్రిపురలో 3, ఒడిశాలో 3, మిజోరాంలో 2, మహారాష్ట్రలో 2 జిల్లాలు, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, నాగాలాండ్, తెలంగాణ, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు పదికిపైగా ఉన్నది. అలాగే దేశంలో 80 శాతానికిపైగా కొత్త కేసులు 15 రాష్ట్రాల్లోని 90 జిల్లాల్లో నమోదవుతున్నాయి. ఇందులో 50 శాతానికిపైగా కొత్త కేసులు మహారాష్ట్ర, కేరళ నుంచే ఉంటున్నాయి.