Brahmastra | సొంత ఇండస్ట్రీ దారుణంగా ముంచేస్తున్న వేళ.. బాలీవుడ్ స్టార్ హీరోల ఆశలన్నీ తెలుగు ఇండస్ట్రీ పైనే ఉంటున్నాయి. అందుకే వాళ్ల సినిమాలను టాలీవుడ్లో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. దానికి ఇక్కడ స్టార్స్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా చిరంజీవి, నాగార్జున ఆశీస్సులతో విడుదలైంది. అయినా కూడా సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఆదరించలేదు. ఇదిలా ఉంటే తాజాగా సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర సినిమాతో వస్తున్నాడు రణబీర్ కపూర్. కరణ్ జోహార్ నిర్మించిన బ్రహ్మాస్త్ర సినిమాకు అయన్ ముఖర్జీ దర్శకుడు.
బాలీవుడ్లో ఎప్పటిలాగే బాయ్కాట్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బ్రహ్మాస్త్ర దర్శక నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాతలు. బ్రహ్మాస్త్ర మొదలైనప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ మధ్యలో ఎన్నో మారిపోయాయి. ఊహించని విధంగా బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవడం.. అది నెపోటిజం కారణంగానే అంటూ స్టార్ కిడ్స్ పై ప్రేక్షకులు పగబట్టడం.. వాళ్ల సినిమాలు చూడొద్దు అంటూ బాయ్ కాట్ చేయడం ఇవన్నీ బాలీవుడ్ సినిమాలకు శాపంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో విడుదలవుతున్న బ్రహ్మాస్త్రకు సౌత్ మార్కెట్ అక్షయపాత్రలా మారింది. ఈ సినిమా సేఫ్గా బయట పడాలంటే కచ్చితంగా దక్షిణాదిన కూడా మంచి కలెక్షన్స్ రావాల్సిందే. నిర్మాతలకు దీనికి మించిన మరో ఆప్షన్ కూడా లేదు. అందుకే ప్రమోషన్ చాలా గట్టిగా చేస్తున్నారు. దానికి తోడు రాజమౌళి సాయం తీసుకుంటున్నారు. ఆయన కూడా ఏపీ తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు తిరిగి సినిమా గురించి నాలుగు మంచి ముక్కలు చెబుతున్నాడు.
ఇక తాజాగా హైదరాబాద్లో బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆగస్టు 27 ఉదయం 11 గంటలకు చెబుదామని ఒక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్లో అతిరథ మహారధులు బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు హాజరు కానున్నారు. ఈ సినిమాలో నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఇంత ప్రమోషన్ చేస్తున్న బ్రహ్మాస్త్ర ఎంత మాయ చేస్తుందో చూడాలి.
“Brahmastra | ‘బ్రహ్మాస్త్ర’కు బటర్ ఫ్లై థియరీ అప్లై అవుతుందా..?”