Rajpal Yadav : బాలీవుడ్ నటుడు, కమెడియన్ రాజ్పాల్ యాదవ్ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ విషయాన్ని శనివారం ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించిన రాజ్పాల్ యాదవ్ ఇటీవల చెక్ బౌన్స్ కేసులో జైలులో లొంగిపోయారు. తాను చెల్లించాల్సిన డబ్బులు అందజేయలేకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు రాజ్పాల్ యాదవ్ జైలులో లొంగిపోయారు.
తిహార్ జైలులో ఉన్న రాజ్పాల్ యాదవ్కు దాదాపు రెండు వారాల తర్వాత, ఈ నెల 17న మధ్యంతర బెయిల్ లభించింది. రూ.1.5 కోట్ల డిపాజిట్ అనంతరం అతడికి కోర్టు మార్చి 18 వరకు బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతడికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, వరుణ్ ధావన్, సోనూ సూద్తోపాటు పలువురు రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖులు కూడా సాయం చేశారు. ఈ నేపథ్యంలో కొంత డబ్బు సమకూరడంతో బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న అతడు కొత్త కెరీర్పై దృష్టి సారించాడు.
ఈ నేపథ్యంలో తాను యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. ‘రాజ్పాల్ నౌరంగ్ యాదవ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో అన్ని వయసులవారికి నచ్చే ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఉంటుందన్నాడు. వ్లాగ్స్, మినీ సిరీస్, కామెడీ, బీటీఎస్ మూమెంట్స్ వంటివి షేర్ చేస్తానని హామీ ఇచ్చాడు. తన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరాడు. దీంతో అతడికి చాలా మంది శుభాకాంక్షలు చెబుతున్నారు. కొత్త జర్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.