SSR Death Case | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్ను బాంబే హైకోర్టు గురువారం రద్దు చేసింది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్ను జస్టిస్ రేవతి మోహితే, మంజుషా దేశ్పాండే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కేసు విచారణ సమయంలో సీబీఐ ఎల్ఓసీ రద్దు చేయడాన్ని వ్యతిరేకించింది. సీబీఐ తరఫు న్యాయవాది శ్రీరామ్ శిర్సత్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల పాటు స్టే విధించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే, ఇందుకు కోర్టు నిరాకరించింది. ఇదిలా ఉండగా.. 14 జూన్ 2020న నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబయిలోని తన ఫ్లాట్లో శవమై కనిపించాడు. ఈ కేసు రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం మృతిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నది. నటుడి మృతి కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబం సైతం అనేక ఆరోపణలు వచ్చాయి.
కుటుంబంతో కలిసి రియా సుశాంత్కు డ్రగ్స్ ఇచ్చిందని ఓ ఆరోపణ. ఈ కేసులో సుశాంత్తో పాటు ఆమె సోదరుడు సైతం అరెస్టు అయ్యారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరవగా విడుదలయ్యాయి. అయితే, ఇప్పటికీ మృతిపై చాలా కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా కుటుంబం విదేశాలకు పారిపోకుండా సీబీఐ లుక్అవుట్ సర్క్యూలర్ జారీ చేసింది. ఇటీవల రియా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు సర్క్యూలర్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.