‘ప్రయత్నలోపం లేకుండా పట్టుదలతో కష్టపడి పనిచేసి అనుకున్నది సాధించడమే నాకు తెలిసింది. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా ప్రారంభించినప్పుడు ‘నువ్వు చేయగలవా’ అంటూ ఎగతాళి చేసి నవ్వుకున్నవాళ్లకు కూడా ఈ రోజు నా విజయాన్ని చూసి నామీద నమ్మకం వచ్చింది’ అంటున్నారు నిర్మాత డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్. రాజా నరేందర్తో కలిసి రమేష్ చెప్పాల దర్శకత్వంలో ఆమె నిర్మించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా డా.బత్తిని కీర్తిలత గౌడ్తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
నా స్వగ్రామం కరీంనగర్ జిల్లా మల్లాపూర్. నా విద్యాభ్యాసం అంతా అమ్మమ్మ ఊరు చర్ల భూత్కూర్లో జరిగింది. మా చిత్రం ‘భీమదేవర పల్లి బ్రాంచి’ సినిమా చిత్రీకరణ మొత్తం ఈ గ్రామంలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. పెళ్లి తరువాత హైదరాబాద్లో ఒకసారి నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల మా అబ్బాయిని చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం చేశాను. మళ్లీ తరువాత కూడా అవకాశాలు రావడంతో ఇంట్లో ఒప్పించి ఆర్టిస్ట్గా చేయడం ప్రారంభించాను. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాలతో పాటు ప్రధాన టెలివిజన్ టీవీ సీరియల్స్లో నటించాను. ఆ తరువాత బొటిక్ బిజినెస్ ప్రారంభించడం, బీఆర్ఎస్ పార్టీ తరపున రాజకీయాల్లో చరుకుగా పాల్గొన్నాను. అయితే ఎన్ని చేస్తున్నా నా మనసు మొత్తం సినిమాల మీదే వుండేది. షూటింగ్లు మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుండేది.
ప్రముఖ సినిమాల్లో నటిగా మంచి పాత్రలు పోషించినా ఎందుకో నాకు సరైన గుర్తింపు రాలేదని కొంచెం అసంతృప్తి ఉండేది. ఆ సమయంలోనే సొంతంగా మనమే సినిమా చేసి మనకు మనమే లైఫ్ ఇచ్చుకోవాలి ఎవరో వస్తారని వేచిచూడటం ఎందుకనిపించింది. ఆ సమయంలోనే దర్శకుడు రమేష్ చెప్పాల ‘భీమదేవర పల్లి బ్రాంచ్’ కథను వినిపించాడు. నేను పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా వుండటం వల్ల ఏమో కాని వినగానే కథ నచ్చింది. కథలో తెలంగాణ నేపథ్యం వుండటం, మన యాస ఇవన్నీ కూడా సినిమా చేయడానికి స్ఫూర్తినిచ్చాయి. వినోదం, పొలిటికల్ సెటైర్, సందేశం, సెంటిమెంట్ ఇలా అన్ని కథలో ఇమిడి వుండటంతో నాతో పాటు మరో నిర్మాత రాజా నరేందర్తో కలిసి వెంటనే చిత్రీకరణ ప్రారంభించాను.
సినిమా విడుదలైన తరువాత మేము అనుకున్న దాని కంటే మంచి స్పందన వచ్చింది. సినిమా చిత్రీకరణ ప్రారంభం నుండి సినిమా విజయం పట్ల నాకు నమ్మకం వుండేది. విడుదల తరువాత కథ ఎంచుకోవడంలోనే నీ ప్రతిభ తెలుస్తుంది. మొదటి సినిమాకే మంచి వాల్యూస్ వున్న కథను ఎంచుకున్నావు అంటూ చాలా మంది అభినందించారు. చాలా మంది ఈ సినిమా ప్రారంభించే ముందు సినిమా చేయగలవా? అంటూ ఎగతాళి చేసి నవ్వారు. కాని నేను మాత్రం ఏదైనా అనుకుంటే అది సాధించేవరకు వదిలిపెట్టను ఆ పట్టుదలతోనే ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు తట్టుకొని ఈ సినిమా నిర్మించి, సక్సెస్ఫుల్గా విడుదల చేసి నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాను. నవ్వుకున్నవాళ్లకే ఈ రోజు నా మీద నమ్మకం వచ్చింది.
కేంద్రప్రభుత్వం ‘జన్ధన్’ పథకం చుట్టు అల్లుకున్న కథ కావడంతో సినిమా విడుదల తరువాత కొన్ని విమర్శలు వచ్చాయి. నేను బీఆర్ఎస్ పార్టీలో వున్నాను కాబట్టి ఇలాంటి విమర్శలు సహజమే. కాకపోతే ఇదొక సామాన్యుడి జీవితం ఇతివృత్తం ప్రధాన కథా వస్తువు కావడంతో పాటు ‘జన్ధన్’ అనే పాయింట్కు నేను కనెక్ట్ కావడం కూడా ఈ సినిమా నిర్మించడానికి ప్రధాన కారణం. ఈ సినిమా విజయం పట్ల సంతోషంగా వున్నాను. త్వరలోనే ఓ కమర్షియల్ కథతో సినిమా చేస్తాను. ఆర్టిస్ట్గా, నిర్మాతగా నా కెరీర్ను కొనసాగిస్తాను. నేను ఎంతగానో ఇష్టపడే బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా కొనసాగుతాను. ప్రయత్న లోపం లేకుండా నమ్మిన దాని కోసం కష్టపడటమే నాకు తెలిసిన పని’ అంటూ ముగించారు డా.బత్తిని కీర్తిలత గౌడ్.