న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజైన తొలి బాలీవుడ్ మూవీ బెల్ బాటమ్( Bell Bottom ). యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీకి పాజిటివ్ రీవ్యూలు వచ్చాయి. 1984లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన ఓ విమాన హైజాక్ ఇతివృత్తమే కథాంశంగా ఈ మూవీని తెరకెక్కింది. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) ఏజెంట్గా అక్షయ్ కనిపించాడు. అయితే నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించినా.. ఇందులో వాస్తవాలను చూపించలేదంటూ యూఏఈతోపాటు సౌదీ అరేబియా, ఖతార్, కువైట్లు ఈ మూవీపై నిషేధం విధించాయి.
బెల్ బాటమ్ అనే కోడ్ నేమ్తో ఉన్న రా ఏజెంట్గా అక్షయ్ ఇందులో నటించాడు. అతడే తన టీమ్తో కలిసి హైజాకర్లను పట్టుకోవడంతోపాటు విమానంలో బందీలందరినీ విడిపించినట్లు సినిమాలో చూపించారు. నిజానికి ఈ ఆపరేషన్కు అక్కడి రక్షణ మంత్రి అనుమతించకపోయినా.. చేపట్టినట్లుగా చెప్పారు. అయితే యూఏఈ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఈ ఆపరేషన్ మొత్తం చేపట్టంది యూఏఈ అధికారులే అని, వాళ్లే భారత ప్రయాణికులను సురక్షితంగా విడిపించారని ఆ దేశం వాదిస్తోంది. అప్పటి రక్షణ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రాషి అల్ మక్తౌమ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగినట్లు చెబుతోంది.
అయితే దీనిని పూర్తి రివర్స్లో చూపించిన కారణంగా బెల్ బాటమ్ మూవీపై ఆ దేశం నిషేధం విధించింది. రంజిత్ తివారీ తెరకెక్కించిన ఈ మూవీలో రా ఏజెంట్గా అక్షయ్ కనిపించగా.. ఇందిరా గాంధీగా లారా దత్తా అద్భుతంగా నటించింది. ఆదిల్ హుస్సేస్, వాణి కపూర్, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు.