వివిధ శాఖల్లో మొత్తం ఖాళీలపై నేడు సమీక్ష
శాఖలవారీగా లెక్కలు తేల్చనున్న అధికారులు
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. అన్ని శాఖల్లోని ఖాళీల తుది లెక్కలుతీసే పనిలో పడ్డారు. ఉద్యోగాల భర్తీపై ఆదివారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఖాళీలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని 22 శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలను ఆదేశిస్తూ ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు శనివారం సర్క్యులర్ జారీచేశారు. ఒక్కో శాఖవారీగా పూర్తి సమాచారం అందించడం, సమీక్షించేలా టైం షెడ్యూల్ను విడుదలచేశారు. యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్, కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్స్, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీశాఖలపై ఉదయం 10 గంటలకు, ఇరిగేషన్, లేబర్, ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ, హోం, న్యాయశాఖపై 10.30కు, లేజిస్లేచర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ విభాగాలతో 11 గంటలకు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్లతో 11.30 గంటలకు, రవాణా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, హౌసింగ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లతో మధ్యాహ్నం 12గంటలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగుల డిపార్ట్మెంట్లతో 12.30 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. శాఖలవారీగా ఎన్ని ఖాళీలున్నాయనే దానిపై ఈ సమావేశంలో స్పష్టత రానున్నది. ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు. 50 వేల ఖాళీలను భర్తీచేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో కొందరు ఉద్యోగులు పదవీవిరమణ చేయటంతో మొత్తం ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నది ఈ సమావేశంలో తేలనున్నది. 50 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను రెండో దశలో భర్తీ చేస్తారు.