ఎల్ఎండీ నుంచి స్విచ్ఛాన్ చేసి నీటిని వదిలిన మంత్రి గంగుల కమలాకర్
నేడు అర్బన్ జిల్లాకు చేరుకోనున్న జలాలు
రైతులు జాగ్రత్తగా వాడుకోవాలి: సీఈ వీరయ్య
ఎల్ఎండీ నుంచి స్విచ్ఛాన్ చేసి నీళ్లు వదిలిన మంత్రి గంగుల కమలాకర్
నేడు అర్బన్ జిల్లాకు చేరుకోనున్న జలాలు
రైతులు జాగ్రత్తగా వాడుకోవాలి: సీఈ వీరయ్య
వరంగల్ సబర్బన్, జూలై 12 : ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని అయిన కాకతీయ కాల్వకు సోమవారం సాగు నీటిని వదిలారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్విచ్ఛాన్ చేసి నీటిని విడుదల చేశారు. ఇవి మంగళవారం అర్బన్ జిల్లాకు చేరుకోనున్నాయి. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో విడుదల చేసే ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని వరంగల్ నీటిపారుదల శాఖ సీఈ వీరయ్య రైతులను కోరారు. వరంగల్ సర్కిల్ పరిధిలో 2 లక్షలకు పైగా ఆయకట్టుకు ఈ సాగు నీరు అందనుంది. ఈ సారి అదునుకు వర్షాలుపడడంతో రైతులు నార్లు పోసుకోవడంతోపాటు బావులు, బోర్లు ఉన్న వాళ్లు నాట్లు కూడా వేస్తున్నారు. మిగతా రైతులు కాకతీయ కాల్వ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కాల్వకు నీటిని వదలడంతో నెలాఖరులోగా పూర్తిస్థాయిలో నాట్లు పడే అవకాశం ఉంది. కాళేశ్వరం నుంచి ముందస్తుగా ఎత్తిపోతలు చేపట్టడంతో ప్రస్తుతం ఎల్ఎండీలో 21.1 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. దీనికి తోడు ఇన్ఫ్లో 4 వేల క్యూసెక్కులుగా ఉంది. నీటి విడుదల చేసిన సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. కరీంనగర్ స్థానికుడిగా మా నీళ్లు మాకే కావాలని అనేక సార్లు ఉద్యమం చేశానన్నారు. ఇప్పుడు స్వయంగా తన చేతులతోనే అన్ని ప్రాంతాలకు నీటిని విడుదల చేసే అవకాశం రావడం ముఖ్యమంత్రి కల్పించిన అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు.