‘మా నాన్నకు సినిమాలంటే ఇష్టం. యూకేలో ఎంబీఏ పూర్తి చేసి ఇండియాకు వచ్చినప్పుడు నాన్న ఇంట్రస్ట్ తెలిసింది. వెంటనే ఆయనకు సపోర్ట్గా నిలిచాను. ఇంతకు ముందు వేరే బేనర్లో ఓ సినిమా చేశాం. ‘అథర్వ’ మా రెండో సినిమా’ అని యువ నిర్మాత సుభాష్ నూతలపాటి అన్నారు. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధానపాత్రధారులుగా మహేశ్రెడ్డి దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘అథర్వ’. డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా సుభాష్ విలేకురులతో మాట్లాడారు. ‘కథ నచ్చి ఈ సినిమా చేశాం. దర్శకుడు మహేశ్ చాలా డీటైల్డ్గా రాసుకున్నాడు. ప్రస్తుతం అందరూ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకూ వెండితెర చూడని థ్రిల్లర్ ఇది. ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమా చేశాం. రీసెంట్గా క్లూస్ టీమ్కు ఈ సినిమా ప్రివ్యూ వేశాం. వారంతా చాలా ఎమోషనల్ అయ్యారు’ అని చెప్పారు సుభాష్. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం అద్భుతంగా ఉంటుందని, ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమా నిర్మించామని నిర్మాత తెలిపారు.