అమరావతి : RRR సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించిందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సినిమా టికెట్ ధరలను నిర్ధారిస్తూ జారీ చేసిన జీవో నెం 13ను ప్రకారం సినిమా రేట్లు మొదటి 10 రోజులకు పెంచుకోవచ్చని ఆయన వివరించారు. వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు ప్రత్యేక టికెట్కు ఆదేశాలిచ్చామని, RRR సినిమా రూ.336 కోట్లు ఖర్చు అయ్యిందని దర్శక, నిర్మాతలు చెప్పారని పేర్కొన్నారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ధరల పెంపు విషయంపై దరఖాస్తు వచ్చిందని, జీఎస్టీ చెల్లించిన తర్వాత ప్రత్యేక టిక్కెట్ రేట్లకు అనుమతిస్తామని తెలిపారు. జీవో కంటే ముందే RRR నిర్మించిన కారణంగా రాష్ట్రంలో 20శాతం షూటింగ్ నిబంధన RRR కు వర్తించదని మంత్రి తెలిపారు. కొత్తగా నిర్మించే సినిమాలకు నిబంధనలు వర్తిస్తాయని అన్నారు.
ఆన్లైన్ టికెటింగ్ కోసం 2 కంపెనీలు టెండర్లు వేశాయని వాటిని పరిశీలిస్తున్నామని వివరించారు. ఈనెల 25న ‘ ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ముఖ్య పాత్రదారులుగా బాలివుడ్ తారలు ఆలియబట్, అజయ్ దేవగణ్ తదితరులు సినిమాలో నటించారు.