ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మనసు దోచేసింది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో చేస్తున్న చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). నిఖిల్(Nikhil Siddharth) హీరోగా నటిస్తున్నాడు. చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిఖిల్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
అయితే ప్రమోషనల్ ఈవెంట్స్ లో అనుపమ కనిపించకపోవడంపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చింది. తాను పలు సినిమాలతో తీరిక లేకుండా బిజీగా ఉన్నానని, అందువల్లే ప్రమోషన్లో కనిపించలేదని చెప్పింది అనుపమ. బిజీ షెడ్యూల్ను బ్యాలెన్స్ చేయడంలో నెలకొన్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని సూచించింది. అందరికీ ధన్యవాదాలు..సినిమా ప్రమోషన్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నిఖిల్ కు ప్రత్యేకించి కృతజ్ఞతలు అంటూ పోస్ట్లో రాసుకొచ్చింది.
ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ఖేర్, ఆదిత్యా మీనన్, హర్ష చెముడు కీ రోల్స్ చేస్తున్నారు. కార్తికేయ 2కు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై కార్తికేయ 2ను తెరకెక్కిస్తున్నారు.