‘గతంతో పోలిస్తే నేను చాలా మారాను. నా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది.’ అన్నారు మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. తనలో ఈ మార్పుకు గల కారణాలను కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారామె. ‘పైకి కనిపించేంత అందంగా కథానాయికల జీవితం ఉండదు. ఇక్కడ అడుగడుగునా అవమానాలే.
వాటన్నింటినీ భరించి నిలబడితేనే కొన్నాళ్లపాటు హీరోయిన్లుగా కెరీర్ సాగించగలం. ఉన్నది ఉన్నట్టు లొకేషన్లో మాట్లాడితే ‘పొగరు’ అంటారు. చెప్పిన టైమ్కి లొకేషన్కి వస్తే రెండుమూడు గంటలు ఖాళీగా కూర్చోబెడతారు. టైమ్కి షూటింగ్ ఎందుకు ప్రారంభించలేదని అడిగితే.. ‘యాటిట్యూడ్’ అంటారు. సహ నటులు ఆలస్యంగా వస్తారని తెలిసినా, మనల్ని మాత్రం టైమ్కి రమ్మంటారు.
ఇదో శాడిజం. ఎవరికోసమే మన టైమ్ వేస్ట్ చేసుకోవడం, సంబంధం లేనివారి కోసం ఎదురు చూడటం నిజంగా నరకం. ఈ విషయంలో చాలాసార్లు బరస్టయి అవమానాలు ఎదుర్కొన్నాను. ఇప్పుడైతే పట్టించుకోవడం మానేశాను. ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా మహిళల విషయంలో ఇదే తంతు.’ అంటూ అసహనం వ్యక్తం చేశారు అనుపమ పరమేశ్వరన్.