Soumya Shetty | స్నేహితురాలి ఇంట్లో కిలో బంగారం కొట్టేసి దొరికిపోయిన సినీ నటి సౌమ్యశెట్టిపై తాజాగా మరో కేసు నమోదైంది. చోరీ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సౌమ్య శెట్టి తమను వేధిస్తున్నదని రిటైర్డ్ పోస్టల్ శాఖ మాజీ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడంతో పాటు, వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సౌమ్య తీరుతో తన కుటుంబం, తన కుమార్తె కుటుంబం మానసిక క్షోభను అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సౌమ్య శెట్టితో పాటు ఆమె తల్లి, భర్త బలరాంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అయితే తాను చోరీ చేయలేదని.. మౌనిక కుటుంబసభ్యులే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సౌమ్య సోషల్మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. తాను మౌనిక ఇంటికి వెళ్లి.. కంగారుగా బయటకు వచ్చినట్లు చెబుతున్న వాళ్లు.. సీసీ టీవీ ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించింది. నాలుగుసార్లు వాళ్ల ఇంటికి వెళ్తే ప్రతిసారి తనకు సెండాఫ్ ఇచ్చేందుకు కిందకు రాలేదా? అని నిలదీసింది. తన డాడీ వెనకాల దాక్కొని మౌనిక డ్రామాలు చేస్తుందని మండిపడింది. తనపై వేసిన నిందలపై న్యాయపోరాటం చేస్తానని.. తన నిజాయితీని నిరూపించుకుంటానని స్పష్టం చేసింది.
వైజాగ్కు చెందిన సౌమ్య శెట్టికి యాక్టింగ్, సినిమాలు అంటే పిచ్చి. ఆ ఆసక్తితోనే పలు షార్ట్ ఫిలింస్లో నటించింది. చిన్న చిన్న సినిమాల్లోనూ ఆమెకు ఛాన్స్లు వచ్చాయి. యువర్స్ లవింగ్లీ, ది ట్రిప్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ఆడిషన్స్ ఇస్తున్న సమయంలోనే వైజాగ్లోని దొండపర్తి బాలాజీ మెట్రో అపార్ట్మెంట్లోని ప్లాట్ నెంబర్ 102లో పోస్టల్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు తన కూతురు మౌనికతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2016లో ఏర్పడిన ఈ పరిచయం కాస్త తరచూ వాళ్ల ఇంటికి వెళ్లే వరకూ వచ్చింది. ఆ చనువుతో ఇంట్లో పరిసరాలన్నీ స్కాన్ చేసిన సౌమ్యకు.. మౌనిక ఇంట్లో ఉన్న కిలో బంగారం కంటపడింది. దీంతో ఎలాగైనా ఆ బంగారం కొట్టేయాలని అనుకున్న సౌమ్య.. మౌనిక ఇంటికి వెళ్లినప్పుడల్లా నేరుగా బెడ్రూంలోకి వెళ్లి.. బాత్రూం వాడుకుంటానని చెప్పి గంటలు గంటలు గడిపేది. ఇలా రెండు మూడు సార్లు చేసిన సౌమ్య.. ప్రతిసారి తన చేతివాటం ప్రదర్శించింది. విడతల వారీగా కిలో బంగారం కొట్టేసింది. కూల్గా గోవాకు చెక్కేసింది.
మౌనిక కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 23 యలమంచిలోని బంధువుల వివాహానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో బంగారు నగల కోసం బీరువా లాకర్ తెరవగా అందులో ఆభరణాలు కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన మౌనిక తండ్రి ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీమ్ సహాయంతో బీరువాపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ను సేకరించింది. అలాగే ప్రసాద్బాబు, మౌనికను విచారించగా ఇటీవల వాళ్లింటికి వచ్చిన పలువురిపై అనుమానం ఉందని తెలిపారు. దీంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి 11 మంది అనుమానితులపై దర్యాప్తు చేపట్టారు. వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే హీరోయిన్ బండారం బయటపడింది. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి 74 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని మౌనిక కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ కేసులో సౌమ్య ఇటీవల బెయిల్పై విడుదలయ్యింది.