తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా వారసులకు అయితే కొదవలేదు. అన్నిచోట్లా ఉన్నారు. కానీ వచ్చిన వారసులంతా హిట్ కొడతారన్న గ్యారెంటీ లేదు.. బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా నిలబడతారన్న నమ్మకం లేదు. ఎంట్రీ ఈజీగానే దొరికినా కూడా కొందరు అస్సలు నిలబడరు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో వారసుడు కూడా తన ఉనికి చాటుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడే ఆనంద్ దేవరకొండ కేరాఫ్ విజయ్ దేవరకొండ. దొరసాని సినిమాతో గతేడాది ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఈ జూనియర్ దేవరకొండ. అచ్చంగా అన్న మాదిరే వాయిస్ ఉంటుంది ఈయనది కూడా. అయితే తెలంగాణ నేపథ్యంలో వచ్చిన దొరసాని సినిమాకు ప్రశంసలు అయితే దక్కాయి కానీ విజయం మాత్రం రాలేదు. గత డిసెంబర్ లో ఈయన నటించిన రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలొడీస్ విడుదలైంది. థియేటర్స్ మూత పడిన సమయంలో ఓటిటి దారిలో వచ్చింది ఈ చిత్రం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. సింపుల్ కథకు తనదైన స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు. ఆనంద్ దేవరకొండ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్. మరోవైపు హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మొత్తంగా మన పక్కింట్లో జరిగే కథలా ఉన్న ఈ సినిమాకు ఓటిటిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన నటిస్తున్న మూడో సినిమా ‘పుష్పక విమానం’ కూడా ఓటిటిలోనే విడుదలయ్యేలా కనిపిస్తుంది. ఈ సినిమాతో దామోదర అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో గీతా సైని, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడు కాగా అతని తండ్రి గోవర్థన్ రావు దేవరకొండ మరో ఇద్దరు నిర్మాతలు విజయ్ రుషి, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని ఈ సినిమాకు స్వరాలందిస్తున్నారు. ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని ఇన్ని రోజులు భావించినా కూడా ప్రస్తుతం పరిస్థితులు చూసిన తర్వాత ఓటిటిలో విడుదల చేయడమే నయమని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మంచి రేట్ వస్తే అక్కడే ఇచ్చేయాలని చూస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.