Amitabh and Ambani | అమితాబ్ బచ్చన్.. భారత సినీ పరిశ్రమ తురుపుముక్క. తన సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొన్నారు. హీరోగా పనికిరాడని అనిపించుకున్న చోటే సూపర్స్టార్గా నిలిచి గెలిచారు. ఆర్థిక విషయాల్లో కూడా చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగారు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మించిన సమయంలో తనకు ఎదురైన దివాళా సమస్య మరోసారి తెరపైకి వచ్చింది.
తాను దివాళా తీసినప్పుడు ధీరూభాయ్ అంబానీ ఆర్థిక మద్దతు ఇస్తానని చెప్పిన విషయాలను ఓ కార్యక్రమం సందర్భంగా అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. 2017 డిసెంబర్ నాటి ఈ వీడియోను బ్రట్ ఇండియా రివైండ్ పేరుతో మరోసారి తమ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసింది. రెండు రోజుల్లో ఈ వీడియోను దాదాపు లక్ష మంది వీక్షించారు.
‘నా జీవితంలో నేను దివాళా తీసిన సందర్భం ఉన్నది. నేను దివాళా తీశాను’ అంటూ భావోద్వేగంతో అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. ‘నేను కోట్లలో అప్పుల్లో ఉన్నాను. ఆదాయ వనరులన్నీ మూసుకుపోయాయి. నా ఇంటిపై ప్రభుత్వం దాడి చేసింది. నా వ్యక్తిగత బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయింది. ధీరూభాయ్కి నా అప్పుల విషయం తెలిసింది. అతను ఎవరికీ చెప్పకుండా తన చిన్న కొడుకు, నా ప్రియ స్నేహితుడు అనిల్తో అమితాబ్ చెడ్డ రోజులను అనుభవిస్తున్నందున కొంత డబ్బు ఇవ్వండి’ అని చెప్పాడు. అతను నాకు ఇవ్వాలనుకున్న మొత్తంతో నా సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికేది. అయితే, నేను అతని దాతృత్వాన్ని అంగీకరించలేనని భావించాను’ అని చెప్పాడు.
గతంలో కూడా అమితాబ్ బచ్చన్ ఈ విషయాలను పలు స్టేజీలపై గుర్తుచేసుకున్నారు. ఆర్థికంగా చితికిపోయిన ఆ సమయంలో యష్ చోప్రా వద్దకెళ్లి సినిమాలో వేషం గురించి కోరగా.. ఆయన తన ‘మొహబ్బతే’ సినిమాలో అమితాబ్కు అవకాశం ఇచ్చాడు. ఇదే సమయంలో కౌన్ బనేగా కరోడ్పతి ధారావాహిక ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి ఎన్నో సినిమాలు చేస్తూ కేబీసీని కొనసాగిస్తున్నాడు. అమితాబ్ ప్రధాన పాత్రలో సూరజ్ బర్జాత్య నిర్మించిన ‘ఉంచాయి’ సినిమా గత నెలలో విడుదలైంది.