ముంబై : మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా, మళ్లింపు ఆరోపణలపై గతేడాది ఫిబ్రవరి 14న సచిన్ జోషిని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు మంజూరు చేసిన మెడికల్ బెయిల్పై బయటే ఉన్నారు. సచిన్ జోషి జీఎంజీ గ్రూప్ ప్రమోటర్, వ్యాపారవేత్త జేఎం జోషి కుమారుడు. గుట్కా, పాన్ మలాసా, హాస్పిటాలిటీ వ్యాపారంలో ఉన్నాడు.
ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు సచిన్ జోషికి ఈ నెల 7న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.30 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తంలో ఇద్దరి పూచీకత్తుపై ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును ఆమోదించగా.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు భారత్ విడిచి వెళ్లరాదని, అలాగే పాస్పోర్టును ఈడీకి అందజేయాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణకు విఘాతం కలిగించే విధంగా, ‘నేరపు రాబడి’కి సంబంధించిన వాటిలో పాల్గొనొద్దని ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు, బెయిల్ ఆర్డర్ అమలుపై స్టే విధించేందుకు మూడు వారాల గడువును అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈడీ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.
ఈడీ నేరాన్ని నిరూపించడంలో విఫలమైందని కోర్టు పేర్కొంది. మార్చి 2020లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని సిటీ చౌక్ పోలీస్ స్టేషన్లో దాఖలైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎం.ఎస్.ఓంకార్ గ్రూప్ ప్రమోటర్లపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ విచారణ సమయంలో కీలక వ్యక్తుల నివాస, కార్యాలయాలతో సహా వివిధ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత 2021, జనవరి 27న ఓంకార్ గ్రూప్ ప్రమోటర్లు బాబూలాల్ వర్మ, కమల్ కిశోర్ గుప్తాలను పీఎంఎల్ఏ, 2002 కింద అరెస్టు చేసింది. అందులో జోషి ప్రమేయం ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దాదాపు రూ.87 కోట్లను దారి మళ్లించినట్టు గుర్తించారు. దీంతో జోషిని పిలిపించి విచారించింది. సచిన్ జోషి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. తెలుగుతో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు. ‘మౌనమేలనోయి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ‘ఒరేయ్ పండు’.. ‘నిన్ను చూడకుండా నేనుండలేను’.. 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు.