Prakash Raj | సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.100కోట్ల పోంజీ స్కీమ్ కేసుకు సంబంధించిన కేసులో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం నవంబర్ 20న తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్కు చెందిన భాగస్వామ్య సంస్థకు సంబంధించిన ఆస్తులపై దర్యాప్తు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే నటుడికి సమన్లు జారీ చేసింది.
ప్రణవ్ జ్యువెల్లర్ రూపొందించిన బోగస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్పై విస్తృతంగా దర్యాప్తులో భాగంగా ప్రకాశ్రాజ్కు సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీకి ప్రకాశ్రాజ్ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల ఈడీ నిర్వహించిన దాడుల్లో 11.60 కిలోల బంగారు ఆభరణాలతో పాటు లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ నిర్వహిస్తున్న పోంజీ పథకం, ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ప్రణవ్ జువెలర్స్, ఇతరులపై తిరుచ్చిలోని ఆర్థిక నేరాల విభాగం (EOW) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈడీ దర్యాప్తు చేస్తున్నది.