నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్: ఓ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా, మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. గురువారం ఎన్నెస్పీ అధికారులు ఏకంగా ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్కు శ్రీశైలం నుంచి 4,38,272 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం 588 (306.1010 టీఎంసీ) అడుగులకు చేరింది. ఉదయం 5.30 గంటలకు 10 క్రస్ట్ గేట్లు, 9 గంటల వ్యవధిలోనే 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,80,016 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ చరిత్రలో ఒకేరోజులో 26 క్రస్ట్గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి.
మొదటిసారి 2009లో విడుదల చేశారు. సాగర్ గేట్లు తెరువడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీశైలం జలాశయానికి 4 లక్షలకుపైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో గురువారం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల ఎత్తుకు తెరిచి నీటిని విడుదల చేశారు. కర్ణాటకలోని టీబీ జలాశయం 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేశుల జలాశయానికి 1,78,454 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 27 గేట్లు ఎత్తి 1,76,359 క్యూసెక్కులు దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టుకు గురువారం రాత్రి వరకు 2.47 లక్షల ఇన్ఫ్లో వస్తుండగా, 2,22,634 క్యూసెక్కుల అవుట్ఫ్లోగా నమోదైంది. కోయిల్సాగర్ ఒక గేటు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది.
శాంతించని గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి వరుసగా మూడో రోజూ కొనసాగింది. గురువారం రాత్రి 7 గంటల వరకు 52.40 అడుగులకు చేరుకుంది. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని గోదావరి పరీవాహకంలోని పలు గ్రామాల వద్ద వరద నీరు పోటెత్తుతున్నది. భద్రాచలం-చర్ల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భద్రాచలంఛత్తీస్గఢ్, ఒడిశాలకు వెళ్లే జాతీయ రహదారిపై నెల్లిపాక వద్ద కూడా రాకపోకలు స్తంభించాయి. సారపాక – బూర్గంపహాడ్, సారపాక అశ్వాపురం మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
శుక్రవారం ఉదయం నుంచి వరద ప్రవాహం క్రమేణా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. వరద పరిస్థితిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరా తీశారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్తో ఫోన్లో మాట్లాడారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నుంచి ఇటు గోదావరిలోకి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గురువారం నాటికి 12.5 మీటర్ల ఎత్తుకు నీటి మట్టం చేరుకున్నది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లక్ష్మి బరాజ్కు గురువారం 9,09,360 క్యూసెక్కుల వరద వచ్చింది. 85 గేట్లన్నీ ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.