బడ్జెట్లో రూ.150 కోట్ల నిధుల కేటాయింపు
త్వరలో కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం
ఖమ్మంలోని పాత బస్టాండ్ ఏసీ కల్యాణ మండపంగా మార్పు
ఈ ఆర్థిక సంవత్సరంలోనే ‘సీతారామ’ పూర్తి
రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం మార్చి 19: ఖమ్మం సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని, రాష్ట్ర బడ్జెట్లో రూ.150 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమని మంత్రి అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం నగరంలోని వీడివోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. త్వరలో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి గుణాత్మక మార్పునకు నాంది పలుకుతామన్నారు. పాత బస్టాండ్ను ఏసీ కల్యాణ మండపంగా మార్చుతున్నట్లు ప్రకటించారు. అనంతరం నగరంలోని ఐటీ హబ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 27న మంత్రి కేటీఆర్ రెండో ఫేజ్ పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో సమీక్షించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ఉన్నారు.
బడ్జెట్లో ఖమ్మం నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రూ.150 కోట్లు కేటాయించి ఖమ్మం నగరానికి గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నగరంలోని వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ ద్వారా సీఎం కేసీఆర్కు తెలంగాణ పట్ల ఉన్న సంకల్పం మరోసారి స్పష్టమైందన్నారు. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమానికి నిధులు అధికంగా కేటాయించారని చెప్పారు. ఉచిత విద్యుత్కు రూ. 11వేల కోట్లు, రుణమాఫీకి రూ.5వేల కోట్లు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 16వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. విద్యా, వైద్యానికి అత్యధిక నిధులు కేటాయించారని, సీఎం దళితుల ఎంపౌర్వెంట్ స్కీంకు వెయ్యికోట్ల రూపాయలు కేటాయించిన కేసీఆర్కు దళితులపై ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. పట్టణ, పల్లె ప్రగతికి రూ. 26 వేల కోట్లు, డబుల్బెడ్ రూం ఇండ్లకు రూ.11వేల కోట్లను కేటాయించారన్నారు. సీతారామకు కేటాయించిన రూ. 680 కోట్లతో ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరంలో దాదాపు పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అదే విధంగా ఆసరాకు రూ. 8వేల కోట్ల కేటాయించారన్నారు. అన్ని రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
రూ. 150 కోట్లతో ఖమ్మానికి గుణాత్మక మార్పునకు శ్రీకారం..
ఖమ్మం నగర అభివృద్ధికి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయించిందన్నారు. వీటితో పాటు గతంలో మంజూరు చేసిన రూ.30 కోట్లు మొత్తం రూ.150 కోట్లతో ఖమ్మం నగరంలో గుణాత్మకమైన మార్పును తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటలో మాదిరిగా సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణం, వైకుంఠధామాల నిర్మాణం, రహదారుల విస్తరణ, డివైడర్ల నిర్మాణం, డ్రైన్ల ఏర్పాటు, జంక్షన్ల నిర్మాణం చేపడతానన్నారు. ఖమ్మం నగరంలో ఇప్పటికే అనేక రకాల అభివృద్ధి పనులు, నిర్మాణాలను పూర్తి చేశామని చెప్పారు. బడ్జెట్లో కేటాయించిన రూ.150 కోట్లతో మంత్రి కేటీఆర్తో చర్చించి వినూత్న పథకాలను శ్రీకారం చూడతానని పువ్వాడ అన్నారు. ఇప్పటికే ఖమ్మంలో అనేక రోడ్లను విస్తరించి సెంట్రల్ లైటింగ్, డివైడర్లను నిర్మించానన్నారు. మరికొన్ని రహదారుల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కాల్వొడ్డులోని వైకుంఠధామాన్ని ఆధునీకరించామని తెలిపారు. టేకులపల్లిలో గెటెట్ కమ్యూనిటితో 1260 డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా 45 వేల నల్లా కనెక్షన్లు కొత్తవి ఇచ్చామన్నారు. 30ఏండ్లకు సరిపడే ట్యాంకులను నిర్మించామన్నారు. ఈవిలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నష్టాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాతత్తం చేస్తుంటే సీఎం కేసీఆర్ నష్టాలలో ఉన్న సంస్థలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ మాట్లాడుతూ స్థానిక సంస్థలకు రూ. 500 కోట్లు కేటాయింపులు చేయడం ద్వారా మండల, జిల్లా పరిషత్లను మరింత బలోపేతం చేశారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ తదితరులు
పాల్గొన్నారు.
నూతన బస్టాండ్ పనులు పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం, మార్చి 19 : ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పనులను రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 27న రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులను కూడా శరవేగంగా పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులతో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టీఆర్ఎస్ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, ఖమ్మం నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ తదితరులు పాల్గొన్నారు.